సంచలన విజయాలకు పేరు మోసిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయం కాలేదు. అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికీ సస్పెన్స్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ఖమ్మం ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఓట్లు కనిపిస్తున్నాయి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఆ ఓట్లు ఏమేరకు లభిస్తాయనే చర్చ సాగుతోంది. పార్లమెంట్ నియోజక వర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందు న్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయమైతే త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైనట్లే.
ఖమ్మం లోక్సభ స్ధానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పై ఇంకా స్పష్టత రాలేదు. అభ్యర్ధిని ఎంపిక విషయంలో ఏఐసీసీ, సీఈసీలు చేతులెత్తేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి వదిలివేయడం పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. ఇప్పటికే గులాబీ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించగా బీజేపీ అభ్యర్ధిగా తాండ్ర వినోద్రావును ఖరారుచేశారు. కాంగ్రెస్కు గట్టీ పోటీ ఇచ్చేందుకు వారు సిద్దమవుతున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ వేవ్లను ఉపయోగించుకుని ఖమ్మం ఎంపీని ఎలాగైనా గెలుపొందాలనే వ్యూహంతో తాండ్ర వినోద్రావు సమీకరణాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న టీడీపీతో ఆ నాయ కులు చర్చలు జరుపుతూ, సమీకరణలు చేస్తుండడంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జోష్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంకా ప్రచారంలో దిగకపోయినా, తమ సామాజికవర్గ బలం తనను ఈ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి విషయంలో ఇంకా తర్జనభర్జన జరుగుతుండడంతో రోజుకో నాయకుడు పేరు తెరపైకి వస్తోంది. ఆ పార్టీలో అభ్యర్ధి ఖరారు ఇప్పట్లో అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ నియోజకవర్గంలో స్పష్టమైన మెజార్టీ ఉంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య ఆధిపత్య పోటీ… ప్రతిపక్ష పార్టీలకు కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. అదే తమకు బలంగా ప్రతిపక్షాలు భావిస్తూ రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారింది. ముగ్గురు ముఖ్యనేతలు ఐక్యతగా ముందుకు సాగితే తప్ప విజయం లభించే పరిస్ధితి కనిపించడంలేదు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రత్యర్ధి ని ఎదుర్కొనకపోతే ప్రతిపక్షాలు లాభపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యనేతలతో పాటు ఎమ్మెల్యేలు అంతా అంకుఠిత దీక్షతో పార్టీ అభ్యర్ధి విజయం కోసం సర్వశక్తులు పెట్టి కృషి చేయాల్సిందే. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్రావు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో బీజేపీ ఆశీస్సులతో గోదాలోకి దిగారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్రావు ప్రధాని మోదీ ఆశీస్సులతో ఖమ్మం జిల్లాను అభివృద్ది చేసి చూపిస్తానని ప్రజల మధ్యకు దూసుకువెళ్తున్నారు. రామజన్మభూమి అంశం, భద్రాచలం రామాలయం అభివృద్దిని ఎన్నికల అస్ర్తంగా మార్చుకుని, హిందుత్వ ఎజెండాతో సాగుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్ధిగా ఖమ్మం పార్టమెంటుకు పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్న టీడీపీతో పాటు రాష్ట్రంలొ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఆయనకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. పార్టీ మారేందుకు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఖమ్మం టికెట్ ఖరారు చేస్తామనే రీతిలో ఆయనపై ఒత్తిడి ఉన్నా, ఆయన ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు సాగాలనే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని దించుతుందా.. నామావైపే చూస్తోందా అన్నదో సస్పెన్స్ .


