మానవత్వం మంటగలిసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సైన్యానికి చెందిన జవాన్ రోడ్డు ప్రమాదానికి గురై రక్తమడుగులో పడివుంటే…ఏ ఒక్కరూ స్పందించలేదు. ఏ వాహన చోదకుడు పట్టించుకోలేదు. అవుటర్ రింగ్ రోడ్డుపై ఈ దురదృష్ట ఘటన చోటుచేసుకుంది.
రోడ్డు దాటుతున్న ఆర్మీ జవాన్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. నడిరోడ్డు మీద రక్తపు మడుగులో జవాన్ పడి ఉంటే… ఏ ఒక్క వాహన చోదకుడు పట్టించుకోకుండా…తమ ప్రయాణాలు సాగించారు. జవాన్ ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారినా…మృతదేహం పక్కనుంచి వాహనాలు వెళ్లిపోయాయి తప్పించి… ఒక్కరంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంతటి ఘోర దృశ్యం…రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దర్శనమిచ్చింది. ఎంతోసేపు ఈ అమానవీయ ఘటన చోటుచేసుకోగా, ఎట్టకేలకు ఓ స్థానికుడు ఈ దురదృష్ట ఘటనను పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారించగా…మృతుడు ఆర్మీ జవాన్ అని, గోల్కొండ ఆర్డినరీ సెంటర్లో పనిచేస్తున్నాడని తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…యూపీ కి చెందిన ఆర్మీ జవాన్ కునాల్ నెల రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. గోల్కొండ ట్రైనింగ్ సెంటర్ లో అథ్లెట్ గా పని చేస్తున్నాడు. నార్సింగి స్టేట్ బ్యాంక్ లో పని ఉండడంతో, ఆయన ఆర్ఆర్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం రోడ్డు దాటుతుండగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళుతున్న రెడీమిక్స్ టిప్పర్ వాహనం జవాన్ కునాల్ ను బలంగా ఢీ కొట్టింది. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న జవాన్ ను పట్టించుకోకుండా టిప్పర్ డ్రైవర్ పరార య్యాడు. అనంతరం సీసీ కెమెరాల ద్వారా రెడిమిక్స్ డిపార్ వాహనాన్ని గుర్తించిన పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. కునాల్ గోల్కొండ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఏ మార్గంలో ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నాడనే విషయంపై ఆర్మీ అధికారులకు పోలీసులు సమాచారం ఇవ్వనున్నారు. ఆయా మార్గాల సీసీ కెమెరాలను పరిశీలించి పూర్తి సమాచారం ఇవ్వనున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆర్మీ అధికారు లకు జవాన్ కునాల్ పార్థివ దేహాన్ని అప్పగించారు. దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే జవాన్ రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో పడివుంటే….మానవత్వం మరిచి ఏ ఒక్క వాహన చోదకుడు పట్టించు కోక పోవడం ఎంత ఘోరం, ఎంత దారుణం అని చూపరులు కన్నీరుపెట్టుకుంటున్నారు.