వైఎస్ఆర్ సీపీలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఒక్కటొక్కటిగా తెరమీదకు వస్తున్న కొద్దీ జగన్ పార్టీలో అనిశ్చితస్థితి మరింతగా పెరుగుతోంది. ఇంకెంతమంది అభ్యర్థులను మారుస్తారో ఎవరికీ తెలియడం లేదు. ఇంతకీ ఏ లాజిక్తో ఇలా మార్పుచేర్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారో తెలియక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కూడా అంతుబట్టడం లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్చార్జ్ల మార్పు సర్వసాధారణంగా మారింది. వై నాట్ 175 …అంటూ బహిరంగ సభ ల్లో ఎంతో ధీమాతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇన్చార్జ్లను అటూఇటూగా మార్చడం పార్టీలో గందరగోళానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీలో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 175.అయితే వీటిలో మూడో వంతుకుపైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చడంలోని ఆంతర్యం పార్టీ నాయకులకు కూడా అంతుబట్టడం లేదు. మార్పులు కూడా అలాఇలా కాదు. చాలా భారీ సంఖ్యలో అభ్యర్థులను మార్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహ న్ రెడ్డి. ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ పడ్డారనడానికి సంకేతాలని అంటున్నారు రాజకీయ పండితులు. వాస్త వానికి 2019 అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొత్తం 175 సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్న వైఖరి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. విడతలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తు న్నారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగమన్న వాదన వినిపిస్తోంది. ఈ సంగతి ఎలాగున్నా, ప్రకటిం చిన పేర్లనే మళ్లీ మళ్లీ మార్చడం మరింత గందరగోళానికి దారితీస్తోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో కలుగుతోంది.
ఎన్నికల రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. అభ్యర్థులు ఒక చోట నుంచి మరో చోటుకు మారడం, వారిని అధినేత లు మార్చడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిచయాలు, స్థానికులతో ఉన్న సంబంధా ల ఆధారంగా అభ్యర్థులను మార్చేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన మార్పుల్లో అటువంటి పరిస్థితులు ఏమీ కనిపించవు. నియోజకవర్గాలు మారడం వల్ల, అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పోలింగ్ కు ముందు ఎన్నికల ప్రచారంలో కిందిస్థాయి క్యాడర్తో అభ్యర్థులు సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే పోలింగ్ రోజున కూడా క్షేత్రస్థాయి కార్యకర్తలతో బూత్ మేనేజ్మెంట్ ఎంతో అవసరం. అప్పటికప్పుడు కొత్త నియోజకవర్గాలకు వెళ్లిన అభ్యర్థులకు ఈ చిక్కులు ఎక్కువగా ఉంటాయి. క్యాడర్తో అప్పటికప్పుడు అభ్యర్థులు కనెక్ట్ కావడం అంత ఈజీ కాదంటున్నారు పార్టీ నేతలు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. మార్చినవారి విషయంలోనైనా స్థిరంగా ఉన్నారా అంటే అదీ లేదు. కొన్ని సీట్లలో మార్చిన వారినే మళ్లీ మళ్లీ మార్చారు. పోనీ అలా మార్చిన వారినే మళ్లీ మళ్లీ మార్చడా నికి ఏమైనా ప్రాతిపదిక ఉందా ? అదీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మారిన నియోజకవర్గాల్లో ఎలా ప్రచారం చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.
కల్యాణదర్గంకు చెందిన మంత్రి ఉషా శ్రీ చరణ్ను పెనుకొండకు మార్చారు. అలాగే మరో మంత్రి విడదల రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చారు. అలాగే మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ లాంటి అనేక మందిని మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మళ్లీ మళ్లీ మార్చడం ఒక ఇబ్బంది అయితే, మరికొన్ని చోట్ల స్థానిక నాయకులతో గానీ అభ్యర్థులతో గానీ ముందుగా సంప్ర దించకుండానే పేర్లను ప్రకటించడం మరో గందరగోళానికి దారితీసింది. ఇదిలాఉంటే భారీ ఎత్తున మార్పుల విషయం లో జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల వాదన మరోలా ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని తప్పించడమే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అంటున్నారు ఆయన సన్నిహితులు. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకునే మార్పులు చేశారని అంటున్నారు. అభ్యర్థుల మార్పు ఇక్కడితో ఆగుతుందా ? లేక రానున్న రోజుల్లో కూడా కొనసాగు తుందా ? అనే విషయమై ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాల్లో స్పష్టత రాలేదు.