వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం కోటి 12 లక్షల కుటుంబల వివరాలు కులగణన సర్వేలో సేకరించామని అన్నారు. 96.9 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని వివరించారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి కులగణన సర్వేపై మాట్లాడారు. ఏడాది క్రితం ఈ సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని.. సరిగ్గా ఏడాది తర్వాత సర్వే నిర్వహించి నివేదికను అసెంబ్లీ ముందు ఉంచామని అన్నారు.
రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ” 75 అంశాలను ప్రాతిపదికగా సర్వే నిర్వహించాం. నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే చేపట్టాం. ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే చేశాం. సర్వేకు ముందు పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారు. ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన లోటుపాట్లను గుర్తించి సరిచేశాం. ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్గ గుర్తించి సర్వే చేపట్టాం. అన్ని శాఖల సిబ్బందిని సర్వేలో భాగస్వాములను చేశాం. సర్వేపై 12 సార్లు సమీక్ష నిర్వహించి పకడ్బందీగా రూపొందించాం. ముందు స్టిక్కర్ అంటించి సర్వే చేయాల్సిన ఇళ్లను గుర్తించాం. ఆ తర్వాత ఇళ్లకు వెళ్లి సిబ్బంది సర్వే చేపట్టారు. సర్వేలో పాల్గొన్న సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. సమాజ అభివృద్ధికి ఈ సర్వే ఓ మార్గదర్శిగా మారుతుంది.
దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదు. జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదు. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టాం.
ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించాం. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించాం. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టాం. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా”.. అని రేవంత్ రెడ్డి తెలిపారు