తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్.. ఫార్ములా ఈ రేసు పేరిట అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తుంది. ఇప్పటికే ఏసీబీ, ఈడీ విచారణను ఎదుర్కున్న కేటీఆర్.. తాను ఏ తప్పూ చేయలేదని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఈ రేసును నిర్వహించామని మీడియా ముందు చెప్పారు. అయితే విచారణ సమయంలో మాత్రం తనకు ఏమీ తెలియదని అంతా అధికారులు, ఫార్ములా ఈ రేసు నిర్వహించిన కంపెనీ ప్రతినిధులకే తెలుసని మాట మార్చినట్లు తెలిసింది.
తెలంగాణలో సంచలనంగా మారిన పార్ములా ఈ రేస్ కేసులో తప్పు జరిగిన మాట వాస్తవమే. ఎలాంటి అనుమతి లేకుండా భారత కరెన్సీని పౌండ్లలోకి మార్చి విదేశీ సంస్థకు కేటాయించింది కూడా నిజమే. ఈ అంశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తెలంగాణ ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయల జరిమానా విధించింది. కానీ.. మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఇందులో ఏమీ తప్పు జరగలేదని ఇప్పటికీ వాదిస్తుండటమే చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ మీడియా ముందు ఒకలా.. విచారణ అధికారుల ముందు మరోలా మాట్లాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసును కేటీఆర్ పూర్తి కన్ఫ్యూజ్గా మార్చారని.. అదే సమయంలో తనకు ఏ బురద అంటకుండా చూసుకుంటున్నారని తెలిసింది.
తాను ఏ తప్పు చేయలేదని, అధికారులే చేశారని మొన్నటి వరకు చెప్పిన కేటీఆర్.. ఏసీబీ, ఈడీ విచారణ సమయంలో ఎస్ నెక్ట్స్ జెన్ కంపెనీ డైరెక్టర్లను ఇరికించారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు ఏసీబీ విచారణను ఎదుర్కుంటున్నారు. ఇందులో చలమలశెట్టి అనిల్ కూడా ఉన్నారు. ఈయనే కేటీఆర్ను ఈ ఫార్ములా ఈ రేసులోకి తీసుకొచ్చారని.. ఈ స్కామ్లో కేటీఆర్ ఇరుక్కోవడానికి కారణం ఆయనే అనే చర్చ జరుగుతోంది. చలమలశెట్టి అనిల్ గ్రీన్కో కంపెనీ ఓనర్. కొన్నివేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. ఫార్ములా ఈ రేసు స్పాన్సర్షిప్ కోసం ఓ కంపెనీని 2022లో ప్రారంభించి.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత నష్టాలు వచ్చాయని కంపెనీని మూసివేశాడు. అయితే ఇదంతా ఒక క్రమ పద్దతిలో చేసిన స్కామ్ అని ఏసీబీ అధికారులు అంచానా వేస్తున్నారు. ఈ స్కామ్కు మూల కారకుడు అనిలే అని చర్చ జరుగుతోంది.
ఫార్ములా ఈ రేస్కు స్పాన్సర్షిప్ చేయడం కోసం ఎస్ నెక్ట్స్ జెన్ ఏర్పాటు చేశారు. అయితే ఇలా ఎందుకు చేశారని ఏసీబీ ఆరా తీస్తోందట. కాగా, ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాల కోసమే తాము స్పాన్సర్షిప్ చేశామని డైరెక్టర్లు ఏసీబీకి చెప్పినట్లు తెలుస్తోంది. నష్టాలు వచ్చాయని స్పాన్సర్షిప్ ఉపసంహరించుకున్న తర్వాత కూడా 41 కోట్ల రూపాయలు ఎందుకు బీఆర్ఎస్కు ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో ఇచ్చారని ఆరా తీయగా.. చెలమలశెట్టి అనిల్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కంటే కేటీఆర్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసేవారు. అన్ని శాఖల మీద కూడా కేటీఆర్కు పట్టు ఉండేది. ఈ క్రమంలో కేటీఆర్కు దగ్గరవ్వడానికి చలమలశెట్టి అనిల్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. అనేక మంది పారిశ్రామిక వేత్తలతో కేటీఆర్ పరిచయాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే చలమలశెట్టి అనీల్ కూడా కేటీఆర్కు దగ్గరయ్యారట. తాను చేస్తున్న వేల కోట్ల రూపాయల వ్యాపారానికి ప్రభుత్వ అవసరం ఉండటంతో కేటీఆర్ మద్దతు కోసం ప్రయత్నించారట. వ్యాపారపరంగా బలపడటానికి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేటీఆర్ సహకారం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నారట. అందుకే ప్రభుత్వానికి కాస్త సహాయం చేసినట్లు కలరింగ్ ఇవ్వాలని ఫార్ములా ఈ రేస్ను స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినట్లు ఏసీబీ ముందు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
చలమలశెట్టి అనిల్ తన వ్యాపార విస్తరణ కోసం కేటీఆర్ను వాడుకున్నారని.. ఈ క్రమంలో కేటీఆర్ ఈ స్కామ్లో ఇరుక్కోవలసి వచ్చిందని తెలిసింది. కేటీఆర్ కూడా ముందు చూపు లేకుండా తొందర పాటు నిర్ణయం తీసుకొని ఇందులో ఇరుక్కొని పోయారని తెలిసింది. మొత్తానికి ఈ స్కామ్లో కేటీఆర్ కావాలని చేసిందేమీ లేదనే వాదన వినిపిస్తోంది. మరి ఏసీబీ, ఈడీ ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.