బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఫిబ్రవరి 19వ తేదీన పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కేసీఆర్ ఆదేశించారు. అధినేత ఆదేశాల మేరకు ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం 1 గంటనుండి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనుంది.
కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు , పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలతో విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నామని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఈ నెల 19వ తేదీన నిర్వహించే సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నామని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరపబోతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని కేటీఆర్ తెలిపారు.