తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరో మెట్టు ఎక్కింది. కిషన్రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖాస్త్రం సంధించారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 9 పేజీలలో ఈ లేఖ రాశారు. కేంద్రానికి ప్రభుత్వ విజ్ఞప్తులను ఆ లేఖలో ప్రస్తావించారు సీఎం. ఎవరెవరిని ఎప్పుడు కలిశారో కూడా తేదీలతో సహా ప్రస్తావించారు. కేంద్రం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మెట్రో ఫేజ్ 2, ఆర్ఆర్ఆర్, మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రైలు, డ్రై పోర్టు నుంచి బందర్ పోర్టుకి, గ్రీన్ ఫీల్డ్ రహదారుల నిర్మాణాలకు సంబంధించి అనుమతుల సాధన కోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిసినట్టుగా గుర్తు చేస్తున్నానని అన్నారు సీఎం. ఈ ప్రాజెక్టులకు మా తరపున వ్యయాన్ని భరిస్తామని ముందుకొచ్చామన్నారు. నిధులు మంజూరు చేయడం మీ నైతిక బాధ్యత అంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖలో గుర్తు చేశారు.
రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కృషి చేయడం కిషన్రెడ్డి నైతిక బాధ్యత అంటూ గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో విస్తరణపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదని లేఖలో స్పష్టం చేశారాయన. మూసీపై కిషన్రెడ్డి ఎందుకు విషం చిమ్ముతున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల అంశంలో కిషన్రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
నాలుగు రోజుల కిందట కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలన అసంతృప్తిగా ఉందన్నారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తున్నారని ప్రశ్నించారు. కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురి చేయడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. కళాశాలల యాజమాన్యాల పట్ల కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కిషన్రెడ్డి లేఖలో దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరుతో కాలేజీల యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే పరిస్థితి దాపురించిందని ఆరోపించారు.