తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములపై ఆయా శాఖలతో కమిటీ ప్రతినిధులు ప్రధానంగా చర్చించనున్నారు. ఆ రెండు విభాగాలకు రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. అయితే, వీటి సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోక పోవడంతో కాలక్రమంలో వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అయితే, ఎండోమెంట్, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూములు, ఆస్తులను కాపాడుకోవాటానికి, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో ధరణి కమిటీలో చర్చించనున్నారు. సర్వే, సెటిల్మెంట్ విభాగం ద్వారా రికార్డుల నిర్వహణ, భూ భారతి కార్యక్రమం, ల్యాండ్ పార్శిల్ మ్యాప్లు, ధరణి పోర్టల్ కింద తీసుకున్న మ్యాప్ల తాజా పరిస్థితిపై ఈ కమిటీ ఆరా తీయనుంది. ఈ సమవేశంలో సీసీఎల్ కమిషనర్, కమిటీ కన్వినర్ నవీన్ మిట్టల్, సభ్యులు ఎం. కోదండరెడ్డి, రేమండ్ పీటర్, వి. లచ్చిరెడ్డి, సునీల్, మధుసూదన్తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.