పాతికేళ్ల కిందట ఏ రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త అంటూ ఎవరూ ఉండేవారు కాదు. ప్రతి రాజకీయ పార్టీ జనంతో మమేకం అయి ఉండేది. సామాన్య ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయా పార్టీల నేతలకు తెలి సేది. పార్టీ పెద్దల సలహాలు, సూచనలమేరకు ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అసలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తలు అవసరమా ? కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి వ్యూహకర్తలకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉందా ?
కొంతకాలంగా రాజకీయ పార్టీలు, ప్రజలకు దూరమవుతున్నాయి. ప్రజలను ఓట్ బ్యాంకులుగా రాజకీయ పార్టీలు చూడ టం మొదలైంది. దీంతో ప్రజల మనసులో ఏముందో రాజకీయ పార్టీలు తెలుసుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యం లోనే ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు. ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీలను గెలుపు తీరాలకు చేర్చడా నికి తమదైన వ్యూహాలు,ఎత్తుగడలతో పొలిటికల్ స్ట్రాటజిస్టులు శ్రమిస్తున్నారు. అధికారం కోసం జరిగే యుద్దంలో ఏ రాజకీ య పార్టీకైనా అంతిమ లక్ష్యం..ఎన్నికల్లో గెలవడమే. ఎన్నికలంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమ ర్శలు,ఎత్తుగడలు, వ్యూహాలు అన్నీ ఉంటాయి. అసలు ఎన్నికలంటేనే ఓ చదరంగం. ఏ పావును ఎక్కడ కదపా లన్నా …అందుకు సంబంధించి అంశాలపై అవగాహన అవసరం. అవసరమైతే గాలిని తమకు అనుకూలంగా మార్చు కోగలిగి ఉండాలి.ఈ విద్యలో ఆరితేరిన వారే ఎన్నికల్లో గెలుస్తారు. అధికారంలోకి వస్తారు.
ప్రస్తుతం సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది. ముప్ఫయి రోజుల్లో తమిళం నేర్పే పుస్తకంలాగా ఎన్నికల్లో పార్టీ లకు గెలుపు చిట్కాలు చెప్పే ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు. భారత రాజకీయాల్లో ఇదొక కొత్త ట్రెండ్. బిహారీ బాబు ప్రశాంత్ కిశోర్ను ఈ కొత్త కల్చర్కు ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. ఎన్నికల వ్యూహకర్తలకు రాజకీయ పార్టీల్లో హైప్ క్రియేట్ చేసిన ఘనత నిస్సందేహంగా ప్రశాంత్ కిశోర్ దే. అంతేకాదు వ్యూహకర్తలకు గ్లామర్ తీసుకువచ్చింది కూడా ప్రశాంత్ కిశోరే. అయితే ఆయా రాజకీయ పార్టీల నుంచి వ్యూహకర్తలు వసూలు చేసే ఫీజు చాలా హై రేంజ్ లో ఉం టుంది. అలా ఇలా కాదు. కొన్ని వందల కోట్లలో ఉంటుందంటారు ఈ విషయాలు బాగా తెలిసిన వాళ్లు.
ఎన్నికల వ్యూహకర్తల పనితీరు భిన్నంగా ఉంటుంది. సిద్ధాంతాల రాద్ధాంతాల పట్టింపు వ్యూహకర్తలకు అసలే మాత్రం ఉండదు. వ్యూహకర్తలకు తెలిసిందల్లా ఒకటే. ప్రజల నాడిని పసిగట్టడం..అలాగే ఒప్పందం కుదుర్చుకున్న రాజకీ యపార్టీకి అనుకూలంగా జనాభిప్రాయాన్ని మరల్చడం.. అందుకు అనుగుణంగా ఎత్తుగడలు వేయడం …వ్యూ హాలు పన్నడం. ఇదే ఎన్నికల వ్యూహకర్తల చేసేవి. అంతకుమించి మరే ఇతర విషయాన్ని వ్యూహకర్తలు పట్టించు కోరు. మనదేశంలో 90వ దశకం నుంచి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల వ్యూహకర్తలు, సర్వేలపై రాజకీయ పార్టీల అధినేతలు ఆధారపడటం ఎక్కువైంది. ఎన్నికల వ్యూహకర్తలు లేకపోతే రాజకీయ పార్టీలు అధికా రంలోకి రావడం అంత సులభం కాదన్న వాతావరణం నెలకొంది. ప్రజాబలం లేని రాజకీయ పార్టీల బలహీన తలను ఆసరాగా చేసుకుని ఎన్నికల వ్యూహకర్తలు మార్కెట్లోకి దూసుకువచ్చారు. సామాన్య ప్రజలు ఎటు వైపు ఉన్నారనే దానికంటే, వ్యూహకర్తలు ఏ రాజకీయ పార్టీ వైపు ఉన్నారనేది కీలకంగా మారింది.
పాత రోజుల్లో ఇలాంటి ఎన్నికల వ్యూహకర్తల అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి రాజకీయ పార్టీ అనునిత్యం ప్రజలతో మమేకం అయి ఉండేది. సామాన్య ప్రజలు తమ నుంచి ఏం కోరు కుంటున్నారో ఆయా పార్టీల నేతలకు తెలిసేది. ఆయా పార్టీలకు సలహాలు ఇచ్చే పెద్దలు అందులోనే వివిధ కీలక పదవుల్లో ఉండేవారు. వారి ఎత్తుగడల మేరకు ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రం లోకి దిగేవి. అయితే ఇప్పుడు దేశంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ప్రజలతో రాజకీయ పార్టీలకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. జనం గుండె లోతుల్లోకి వెళ్లి తొంగి చూసేంతటి ఓపిక, తీరికా రాజకీయ పార్టీలకు లేకుండా పోయాయి. అందుకే ఆ పని చేయడానికి వందల కోట్లు వెచ్చించి వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నాయి రాజకీయపార్టీలు.
ఒక్క వామపక్ష పార్టీలు మినహా మనదేశంలోని దాదాపు అన్ని ప్రధాన పార్టీలు, ఎన్నికల వ్యూహకర్తల సేవలను ఉప యోగించుకున్నాయి. ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నాయి. రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీల్లో కీలకమైన ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల వ్యూహకర్తల సేవలను ఉపయోగించుకున్నాయి. ఇక్కడ రాజకీయ పార్టీల వాదన కూడా భిన్నంగా ఉంటోంది. ప్రజలతో ఎంతగా మమేకమైనప్పటికీ, ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా ప్రోది చేయడానికి ఎన్నికల వ్యూహకర్త లు అవసరం అంటున్నారు. మారిన కాలంలో పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఒక బిజినెస్గా మారిందన్న వాస్తవాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. దీంతో ఒక పార్టీని చూసి మరో పార్టీ వ్యూహకర్తలను ఆశ్రయిస్తోంది. గెలుపు తీరాలకు తమను చేర్చాల్సిందిగా కోరుతూ వ్యూహకర్తలతో రాజకీయ పార్టీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.


