స్వతంత్ర వెబ్ డెస్క్: అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇటీవల ఆశావాహుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని పొలిటికల్ అఫైర్ కమిటీ పరిశీలించింది. ఈ మేరకు స్క్రూటినీ నిర్వహించి టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపించింది. ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీ రెండు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ షార్ట్లిస్ట్ చేసి ఢిల్లీ అధిష్టానానికి సీల్డ్ కవర్లో పంపనుంది. ఆ తర్వాత హైకమాండ్ పరిశీలన చేపట్టి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. త్వరలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, జాబితాను సిద్దం చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఖరారులో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
బుధవారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రుల నుంచి వచ్చిన అభిప్రాయాలను కమిటీ చర్చిస్తుంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటన చేయాలనే ఆలోచనలో టీపీసీసీ ఉంది. ఇప్పటికే దాదాపు 24 మంది అభ్యర్థులు ఫిక్స్ అవ్వగా..మిగతా సీట్ల విషయంలో కసరత్తులు చేస్తోంది.