చేవెళ్లలో బీసీ అభ్యర్థిని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే పార్లమెంట్ బరిలో దింపిందా..? బలంగా ఉన్న బీసీ ఓట్లే టార్గెట్గా ముందుకు సాగుతోందా..? సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ను అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఉన్న గులాబీ ఆంతర్యమేంటి..? హైకమాండ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపే లక్ష్యంగా కాసాని పావులు కదుపుతున్నారా! చేవెళ్ల పార్లమెంట్ ఫైట్ ఎలా ఉండబోతోంది..?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోలాహాలంతో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతు న్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న కసిలో ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ అస్త్రంతో బరిలో దిగింది. చేవెళ్ళ పార్లమెంట్ స్థానంలో బలమైన బీసీ నేతగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ను లోక్సభ రేసుకు ఎంచుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాసాని,… జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలడని భావించిన గులాబీ బాస్ కాసానిని బరిలో దించారు.
చేవేళ్లలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడటంతో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి పోటీ చేస్తుండటంతో.. బీసీ అభ్యర్థి కాసాని అయితేనే తమకు కలిసివస్తుందని భావించింది బీఆర్ఎస్ హైకమాండ్. ఇక ఇప్పటికే నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు కూడా విస్తృత ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో తన భాగస్వామ్యం వుందని.. తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రచారంలో ఓట్లు అడుగుతున్నారు కాసాని.
చెవెళ్ల పార్లమెంట్లో నగర, గ్రామీణ ప్రాంతాలున్నాయి. హైటెక్ సిటీ ఉన్న శేరిలింగంపల్లి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గాలు ఉంటే… గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ తన ఆధిక్యతను ప్రదర్శించింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ళ, మహేశ్వరం నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. దీంతో పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం తనకు కలివస్తుందన్న ధీమాలో ఉన్నారు కాసాని. కాగా,.. తాండూరు, పరిగి వికారాబాద్ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ విక్టరీ కొట్టింది.
చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మొత్తం 29 లక్షల 6 వేలకుపైగా ఓటర్లు వున్నారు. వీరిలో 14 లక్షల 88 వేల 326 మంది పురుషులు కాగా.. 14 లక్షల 17 వేల 612 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తంలో బీసీ ఓటర్లే అధికం. కాంగ్రెస్, బీజేపీలది రెడ్డి సామాజిక వర్గం కావడంతో.. బీసీ సామాజిక వర్గమైన తనకు ఎన్నికల్లో లబ్ది చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు కాసాని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో చేవెళ్లలో బిఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందగా 2019 ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తుండగా.. గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు రాష్ట్రంలో బలమైన బీసీ నేత, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను రేసులో దించింది బీఆర్ఎస్.
కాసాని జ్ఞానేశ్వర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పని చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల సమయంలో మన తెలంగాణ పార్టీని స్థాపించి చేవెళ్ళ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన కాసాని.. రాష్ట్ర విభజన తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రా బాద్ అసెంబ్లీ స్థానం బరిలో దిగారు. ఆ తర్వాత టీడీపీలో చేరి తెలంగాణ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. అయితే,..అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ పోటీ నుండి తప్పుకోవడంతో బీఆర్ఎస్లో చేరిన ఆయనను చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నారు కాసాని. ఈ సారి కూడా చేవెళ్లలో బీఆర్ఎస్ విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా..? ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది ? అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే .