ఏపీలో ఇవాళ్టి నుంచి వాట్సాప్ ద్వారా పౌర సేవలను పొందే వీలును కల్పించింది ప్రభుత్వం. గురువారం వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించింది. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ ఈ సేవలను ప్రారంభించారు. ఇందుకోసం అధికారికంగా 95523 00009 వాట్సాప్ నెంబర్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ ఎకౌంట్కు టిక్ మార్క్ ఉంది. ప్రజలకు పౌరసేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను వాట్సప్ ద్వారానే స్వీకరించడం, ప్రజలకు అవరసమైన సమాచారాన్ని కూడా ఈ వాట్సాప్ ఖాతా ద్వారా ప్రభుత్వం చేరవేయనుంది.
ఇక ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పనుంది. ఏ సమస్య వచ్చినా, వినతులు ఇవ్వాలన్నా ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.. అలాగే ప్రభుత్వం నుంచి సమాచారం పొందవచ్చు. తొలి దశలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. తర్వాతి దశలో మరికొన్ని సేవలను అందుబాటులోకి తెస్తారు.
ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే… ఈ వాట్సప్ ద్వారా సందేశం పంపిస్తుంది. అలాగే ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలన్నా ఈ వాట్సప్ ఎకౌంట్ ద్వారా తెలియజేసే వీలుంటుంది. ప్రజలు తమ ఫిర్యాదును ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే వారికి ఓ లింక్ వస్తుంది. అందులో పూర్తి వివరాలు.. అంటే పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ వంటి వివరాలను పొందుపరచాలి. వినతిని టైప్ చేయాల్సి ఉంటుంది. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకూ వచ్చింది? ఎవరివద్ద ఉందనేది తెలుసుకోవచ్చు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా ఈ వాట్పాస్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. టికెట్లు, వసతి సహా అన్ని బుక్ చేసుకోవచ్చు. విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆస్తి పన్నుల వివరాలు, దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగ్, రెవెన్యూ శాఖకు సంబంధించిన వివరాలు, సర్టిఫికెట్లు .. ఇలా అన్ని పౌర సేవలను ప్రభుత్వం ప్రకటించిన వాట్సాప్ నెంబర్ ద్వారా పొందవచ్చు.