ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కాంక్షిస్తే… వారు వీరైనా, వీరు వారైనా పాత పథకాలైనా, ఎవరి శపథాలైనా..ఏవైనా కంటిన్యూ చేయడం, అమలు చేయడం చేయాలి. పేర్లు మార్చేస్తే ప్రయోజన ఏమిటి.. ఇది ఇప్పుడు విశాఖ నగరవాసులు సంధిస్తున్న ప్రశ్నలు. ఏ ప్రభుత్వం వచ్చినా.. పాతవాటి పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ..ప్రజా ప్రయోజనాలు కాపాడడం, ప్రజాభీష్టానికి అనుగుణంగా నడవడంలో ఉండడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ క్రికెట్ స్టేడియం పేరుమార్పు రాజకీయ క్రీడ టీడీపీ, వైసీపీ మధ్య వైరానికి కారణం అయ్యింది.
ఇటీవల వైయస్ఆర్ జిల్లా పేరును వైయస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేనా…వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చడానికి రెడీ అయ్యింది. తాజాగా విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీబీ వీడీసీఎం స్టేడియం పేరులో..వైఎస్ఆర్ పేరు కట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు అసంబద్ద నిర్ణయాలని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున వర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారని, బాపట్లలో వైఎస్సార్ విగ్రహాన్ని తగలబెట్టారని వైసీపీ నేతలు ఆరోపించారు.
విశాఖ స్టేడియంలో వైఎస్ఆర్ పేరును తొలగించడాన్నినిరసిస్తూ స్టేడియం వద్ద వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అధికారం మారినప్పుడల్లా పేర్ల మార్పుపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గతంలో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం వైయస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చింది. అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరును హెల్త్వర్సిటీకి పెట్టింది కూటమి ప్రభుత్వం. విశాఖ సీతకొండ హిల్వ్యూ పాయింట్కు గత వైసీపీ ప్రభుత్వం.. వైయస్ పేరు పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి అబ్దుల్ కలామ్ వ్యూ పాయింట్గా పేరు మార్చింది.
2019లో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాల పేర్లను వైసీపీ ప్రభుత్వం మార్చివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్, వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పథకాలకు కొత్త పేర్లు పెట్టింది. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా.. జగనన్న విద్యా కానుక పథకాన్ని ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ అని పేరు పెట్టారు. అలాగే, జగనన్న గోరుముద్దను ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా మార్పు చేశారు.
జగనన్న ఆణిముత్యాలను ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా కూటమి ప్రభుత్వం మార్పుచేసింది . జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్’గా మార్చారు. జగనన్న విద్యాదీవెన పథకం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా మార్చింది కొత్త ప్రభుత్వం. అలాగే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరు కాస్తా.. ఎన్టీఆర్ ఆరోగ్య భరోసాగా మారింది. రాష్ట్రంలో వైఎస్ పేరు కనిపిస్తే కూటమి పార్టీలకు భయం పుడుతోందని..అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని వైసీపీ మండిపడుతోంది.
విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ చర్యను నిరసిస్తూ విశాఖపట్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వైయస్ఆర్ పేరును తొలగించాలన్న కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలను సాగనివ్వమని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మహానేత వైయస్ఆర్ ఆనవాళ్ళను తుడిచేయాలని సీఎం చంద్రబాబు అనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు.
బైట్ ః గుడివాడ అమర్ నాథ్, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు
ఉమ్మడి ఏపీకి రెండుసార్లు సీఎంగా పనిచేసిన స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి సేవలకు గుర్తుగా విశాఖపట్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఆయన పేరును పెడుతూ 2009లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత పదహారు సంవత్సరాలుగా డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగానే ఇక్కడ అనేక అంతర్జాతీయ, జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. స్టేడియంలో మాజీ సీఎం స్వర్గీయ వైయస్ఆర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు.
అన్నింటా వైఎస్ఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, చివరికి విశాఖ అంతర్జాతీయ స్టేడియంకు ఉన్న వైయస్ఆర్ పేరును తీసేందుకు కుట్ర చేస్తోందని అమరనాథ్ ఆగ్రహం చెందారు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో సంయమనం పాటిస్తున్నామని అన్నారు. అయితే, స్టేడియం వద్ద నిరసనలు తెలియచేస్తామని చెప్పడంతో వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు గృహనిర్భందంలోకి తీసుకున్నారు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం రాజకీయ పదవుల్లో ఉన్నవారు క్రికెట్ అసోసియేషన్లకు బాధ్యత వహించకూడదని, దానిని కూడా ఉల్లంఘించి, టీడీపీ ఎంపీలు ఎసిఎను కైవశం చేసుకున్నారని అమర్ నాథ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వైయస్ఆర్ పేరును చూస్తేనే ఉలిక్కిపడుతోందని అన్నారు. వైయస్ సీఎంగా పనిచేసిన సమయంలో విశాఖపట్నంను , బీఆర్టీఎస్ వ్యవస్థను ఎంతో అభివృద్ది చేశారన్నారు. విశాఖట్నంను ఆర్థిక కేపిటల్గా తీర్చిదిద్దారని చెప్పారు.
వైసీపీ హయాంలో వైయస్ జగన్ నేతృత్వంలో నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులకు ఆడుదాం ఆంధ్రా పేరతో అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. నాలుగు సార్లు సీఎంగా చేసినా చంద్రబాబు క్రీడలను ఏనాడు ప్రోత్సహించలేదని విమర్శలు గుప్పించారు.
—-