ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పినట్లు పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న గడువు జూన్ 2తో ముగియనుంది. 2 జూన్ 2024 నుంచి హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. 2014లో ఆంధ్రప్రేశ్ రాష్ట్ర విభజన జరిగినా ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు సైతం పూర్తిగా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య భిన్నమైన వాదనలు తెరపైకి వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాధాన్యమి వ్వడంతో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఏపీకి చెందిన కొందరు నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున, మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కోరారు భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు వీవీ లక్ష్మీనారాయణ. భారత రాష్ట్రపతి ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. రాష్ట్రపతిని ఒప్పించాలని ఏపీలోని ఇతర పార్టీలను లక్ష్మినారాయణ కోరారు. 2034 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచాలని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ కూడా ఇటీవల డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాల స్వాధీనంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్, అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాల న్నారు సీఎం రేవంత్, క్లిష్టమైన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. జూన్ తర్వాత ఏపీ ఆధీనంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ అంశాలపై పరిష్కారానికి కార్యాచరణ తయారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఫిల్మ్ డెవలప్ మెంట్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్టిపిసి, ఆర్టిసి, సింగరేణి, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలు కొలిక్కి రాలేదు. విభజన చట్టం నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏపి, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో చర్చించినప్పటికీ పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే ఢిల్లీలో ఉన్న ఏపి భవన్, భూమి పంపకంపై రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ ఉద్యోగులు అటు హైదరాబాద్, ఇటు విజయవాడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏపి, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల కేటాయింపు పెండింగ్లో ఉంది. మరోవైపు ఎపికి చెందిన ఉద్యోగులు తెలంగాణలో 1,200 మంది వరకూ ఉన్నారు. ఏపి నుండి తెలంగాణకు వెళ్లాల్సిన ఉద్యోగులు 1,600 మందికిపైగా ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుపై సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కాని పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నాయి. ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే, జూన్ 2నే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు నేతలనుంచి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరింత కాలం పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుండటంతో కేంద్రం నిర్ణయం ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది.