ఏదైనా పార్టీ కార్యక్రమం ఉంటే తప్ప.. వైసీపీ అధినేత జగన్..ఏపీలో ఉండడం లేదు. అయిపోగానే వెంటనే బెంగళూరు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు కూడా బెంగళూరు నుంచి అసెంబ్లీ సమావేశాల కోసం వచ్చారు. ఇన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని జగన్.. అనర్హత వేటు తప్పించుకునేందుకు బడ్జెట్ సమావేశాల మొదటి రోజు సభకు హాజరయ్యారు. 11 నిమిషాలు కాగానే ప్రతిపక్ష హోదా డిమాండ్ పేరుతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యరు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలని చెప్పారు.
జగన్ మాట్లాడుతూ.. “ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటాను. ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం.
పార్టీకోసం, ప్రజల కోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి.
అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం.
అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడికి దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరంగా మాట్లాడుతాను. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. అసెంబ్లీలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి, ప్రెస్మీట్లలో ప్రజలకు వివరిస్తున్నాను. కాని కౌన్సిల్లో మనకు మంచి మెజార్టీ ఉంది. దీన్ని వినియోగించుకోవాలి”… అని జగన్ అన్నారు.
ఈ సమావేశంలో అన్యాయంగా ఇళ్లపట్టాలు రద్దు చేస్తున్నారని వైయస్.జగన్ దృష్టికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మన హయాంలో 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని చెప్పారు. పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు ఎవరైనా ఇళ్లుకట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరుచేసి ఇవ్వాలి.. అంతేగాని, పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటి? అని ప్రశ్నించారు. పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.
కాలనీలు పేర్లు కూడా మారుస్తున్నారని ఈ సమావేశాలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎవరు ఇళ్లస్థలాలు ఇచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసని జగన్ వారితో అన్నారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని మనం నిర్మించామని అన్నారు. కాని పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేద్కర్ విగ్రహంమీదే దాడికి దిగారని చెప్పారు ప్రభుత్వం ఆదేశాలతో ఏకంగా అధికారులే దీనికి ఒడిగట్టారని ఆరోపించారు. స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?… కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ జగన్.