తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదైంది. ఏపీలో వృద్ధులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలవారు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. గంట లకొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ వజ్రాయుధం లాంటి ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 175 శాసన సభ, 25 లోక్సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 68.04 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ఇంకొన్ని కేంద్రాల్లో మాత్రం రాత్రి 10 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది సొంత గ్రామాలు, పట్టణాలకు తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా యువతరంలో ఉత్సాహం బాగా కనిపించింది.
అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో గల అరకు, రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా మధ్యాహ్నం వేళలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. ప్రధానంగా 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశముంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64 శాతం మేర పోలింగ్ జరిగింది. అప్పటితో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు.
ఏపీలో అత్యధికంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 79.90 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 78.84 శాతంతో డోన్ నియోజకవర్గం రెండోస్థానంలో నిలిచింది. జమ్మలమడుగులో 78.55 శాతం, రామచంద్రపురం 79.38 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా పాడేరు నియోజకవర్గంలో 45.78 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 81 నియోజకవర్గాల్లో 70%కు పైగా పోలింగ్ నమోదైంది. గిరిజన ప్రాంతాల్లోని నియోజకవర్గాలు, నగరాల్లోని నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ జరి గింది.