బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో రాత్రి 9.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ఈసారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేనని సుశీల్ కుమార్ మోదీ గత నెలలో ప్రకటించారు. ఇవాళ పాట్నాలోని నివాసానికి సుశీల్ కుమార్ భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బిహార్ మంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా సహా పలువులు బీజేపీ నాయకులు సుశీల్ మోడీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుశీల్ కుమార్ మోదీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. బీహార్లో బీజేపీ ఎదుగుదల, విజయంలో ఆయన ఎనలేని పాత్ర పోషించారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
72 ఏళ్ల సుశీల్ కుమార్ బిహార్ రాజకీయాల్లో సీనియర్ నేత. 2005 నుంచి 2020 మధ్య సీఎం నీతీశ్ కుమార్ ప్రభుత్వంలో రెండు దఫాలుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాసవాన్ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఆయన పదవీకాలం ముగిసింది.