విజయవాడ గడ్డ అంటేనే ఎందరో మహానీయులకు, రాజకీయాలకు పెట్టింది పేరు. ఇదంతా ఓ వైపు మాత్రమే. మరోవైపు బ్లేడ్ బ్యాచులు, రౌడీ షీటర్లు, గంజాయి ముఠాలకు అడ్డాగా ఉంది. దీంతో విజయవాడ పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో బెజవాడ చరిత్రలోనే ఓ మహిళను నగర బహిష్కరణ చేస్తూ సీపీ కాంతిరాణా టాటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి సారమ్మ అనే మహిళ గంజాయి విక్రయిస్తూ అనేక సార్లు పట్టుబడింది. ఇప్పటికే ఆమెపై 13కేసులు నమోదయ్యాయి. అయినా కానీ తన పద్ధతి మార్చుకోకుండా గంజాయి విక్రయిస్తోంది. ఎంతకీ ఆ మహిళలో మార్పు రాకపోవడంతో నగర బహిష్కరణ చేశారు.
2021లో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కాంతి రాణా తనదైన శైలిలో పనిచేస్తున్నారు. రౌడీ షీటర్లతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తీరు మార్చుకోని రౌడీ షీటర్లను నగర బహిష్కరణ కూడా చేశారు. అయితే ఇప్పుడు తొలిసారిగా ఓ మహిళను కూడా నగరం నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. ఎవరైనా సరే పద్ధతి మార్చుకోకపోతే ఇలాగే ఉక్కుపాదం మోపుతామని సీపీ హెచ్చరించారు.