మాజీ ఎంపీ విజయశాంతి.. మహిళల బీసీ కోటాలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం ఆమె న్యూ ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారట.
విజయశాంతి తన రాజకీయ జీవితాన్ని బీజేపీతో ప్రారంభించారు. తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించినా.. తదనంతర పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలో కలిపేశారు. అప్పుడే ఆమె మెదక్ ఎంపీగా ఎన్నికయ్యారు.
తర్వాత టీఆర్ఎస్ పార్టీని వీడిన ఆమె.. కాంగ్రెస్లో చేరిపోయారు. తర్వాత మళ్లీ బీజేపీలో చేరినా 2024 పార్లమెంటు ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న విజయశాంతి .. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం సైలెంట్గానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. అయితే భార్య కోసం రేఖా నాయక్ భర్త ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏఐసీసీ సెకట్రరీలు విష్ణునాథ్, విశ్వనాథన్లను కలిశారట.
ఏఐసీసీ సెక్రటరీలు ముఖ్యమైన నేతలకు ఫోన్లు చేశారట. సుమారు 30 మంది నేతలకు ఫోన్ చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ నేతలు.. విష్ణునాథ్, విశ్వనాథన్లను కలిసి ముఖాముఖీగా మాట్లాడబోతున్నారట.
ఏఐసీసీ నేతలు.. నియోకవర్గాల్లోని తాజా పరిస్థితులు అంటే.. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరు గురించి తెలుసుకోబోతున్నారట. పార్టీ కేడర్, లీడర్ల మధ్య గ్యాప్, పాత కొత్త నేతల మధ్య విభేదాలు.. వంటి సమాచారాన్ని సేకరించబోతున్నారట. నేతలు ఇవ్వబోయే వివరాల ఆధారంగా ఏఐసీసీ నేతలు నివేదికను తయారుచేస్తారట.
గాంధీభవన్లో ఏఐసీసీ సెక్రటరీలు నిర్వహించిన సమావేశాలకు ఒక్కొక్కరిగా నేతలు హాజరయ్యారు. మీరు అదనపు బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా..? వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా..? కార్యక్రమాలపై ఏమైనా ఐడియాలు ఉన్నాయా..?.. ఇలాంటి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.