స్వతంత్ర, వెబ్ డెస్క్: అమర్నాథ్ యాత్రపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. హైలెవెల్ రివ్యూ మీటింగ్లో అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు. యాత్రికులకు అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునే విషయంపై చర్చించారు. యాత్రకు వెళ్లే మార్గంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నుంచి యాత్ర బేస్ క్యాంపు వరకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రిపూట కూడా శ్రీనగర్, జమ్మూ నుంచి విమాన సర్వీసును అందించాలన్నారు. అలాగే ఆక్సిజన్ సిలిండర్ల తగినంత నిల్వ ఉంచాలని, అదనపు వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అమర్నాథ్ యాత్రికుల కోసం అవసరమైన రవాణా, బస, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్, ఆరోగ్యంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాల కోసం తగిన ఏర్పాట్లు చేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు. యాత్ర మార్గంలో మెరుగైన కమ్యూనికేషన్ను అందించాలని, కొండచరియలు విరిగితే తక్షణమే మార్గాన్ని తెరవడానికి యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.