వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే, వైసీపీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు నిన్న అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు, ప్రకటనలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రం అవుతోందని జగన్ అన్నారు. అందువల్ల పార్టీ నాయకత్వమంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండ గట్టాలని సీనియర్ నేతలకు పిలుపునిచ్చారు. సూపర్సిక్స్ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా.. ఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ ఆదేశించారు. అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ సూచించారు. పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, పేర్ని కిట్టు, కొట్టు సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నందిగం సురేష్, ఎస్వీ మోహన్రెడ్డి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.