దేశంలో ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లు ఉన్నారు. ఈ దశలో 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ తదితర కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బిహార్లో 5, ఝార్ఖండ్లో 3, జమ్మూకశ్మీర్లో 1, లద్దాఖ్లో 1 స్థానానికి పోలింగ్ ప్రారంభం అయింది.
పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాయావతి, అనిల్ అంబానీ, హీరో అక్షయ్ కుమార్ ఓటు వేశారు. ఈ 49 స్థానాల్లో ఎన్డీయే, ఇండియా కూటమికి మధ్య పోటీ హోరాహోరీ సాగుతుండడంతో ఐదో దశ బీజేపీకి కీలకంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 39 స్థానాలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. కీలక నియోజకవర్గాల వారీగా చూస్తే.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ఈసారి ఆమె తనయుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు.ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేఠీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండూ కాంగ్రెస్కు కంచుకోటల్లాంటి సీట్లు. అయితే అయిదేళ్ల కిందట అమేఠీలో రాహుల్గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాహుల్ రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేఠీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలో దించింది. లఖ్నవూలో హ్యాట్రిక్పై రాజ్నాథ్ సింగ్ గురిపెట్టారు.
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ 17.37 లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో 500 మందికిపైగా శతాధిక వయస్కులు కావడం గమనార్హం. బారాముల్లాలో మొత్తం 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 14 మంది స్వతంత్రులు. ఇక్కడ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జాద్ లోన్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. పశ్చిమ బెంగాల్లో ఏడు సీట్లకు పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రతి విడతలోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికితోడు ఐదో విడతలోని 57% పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించడంతో ముందు జాగ్రత్త చర్యగా 60 వేలకుపైగా కేంద్ర బలగాలతోపాటు 29వేల 172 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు. ఒడిశాలో ఐదు లోక్సభ స్థానాలతోపాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభం అయింది.