స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో అడిషన్లు పొందడానికి నిర్వహించే ‘నీట్ పరీక్ష’కు సర్వం సిద్ధమైంది. దేశంలో 499 నగరాలు, పట్టణాలతో పాటు విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షను రాసేందుకు దేశవ్యాప్తంగా 20,87,449 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణ నుంచి దాదాపు 70వేల మంది వరకు ఉన్నారు. అయితే తెలంగాణలో 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ(NTA) వెల్లడించింది.
ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నిర్వహించే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 నిమిషాల సమయాన్ని కేటాయించారు. మొత్తం ప్రశ్నలకు 180 ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష రాసేందుకు అనుమతి కల్పించారు. మధ్యాహ్నం 1:30 తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల వరకు డిబార్ చేస్తామని హెచ్చరించింది. పరీక్షా హాల్ కు వచ్చే అభ్యర్థులు.. అడ్మిట్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫోటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకు రావాలని తెలిపింది.