తెలంగాణలో మరోసారి కులగణన చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇంతకుముందు సర్వేలో పాల్గొనని వారికి సర్కారు మరోసారి అవకాశం ఇవ్వనుంది. సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారు ఫిబ్రవరి 16వ తేదీ నుండి 28 వరకు నమోదు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఇంకా భట్టి మాట్లాడుతూ.. ” కులగణన సర్వేను లెక్కలతో సహా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టారు. సర్వేపై వివిధ రాజకీయ పార్టీలు,బీసీ సంఘాలు తమ అభిప్రాయాలు చెప్పాయి. 3.1 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం చెప్పింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనలేదు. కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్లు ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనలేదు. అసెంబ్లీలో పెట్టిన తర్వాత రీసర్వే చేయాలని అంటున్నారు.
ఫిబ్రవరి 16 వ తేదీ నుండి 28వ తేదీ వరకు మిగిలిన వారు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించాము. టోల్ ఫ్రీ ద్వారా, ప్రజావాణి ద్వారా, ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. కేసీఆర్కు మరోసారి అవకాశం ఇస్తున్నాం. రాష్ట్ర జనాభా లెక్కల్లో కలవాలి. కేసీఆర్ జనజీవన స్రవంతిలో కలవాలి.
మార్చి మొదటి వారంలో క్యాబినెట్ లో సర్వే లెక్కలను పెట్టి తీర్మానం చేసి ఆ తర్వాత అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం అసెంబ్లీలో చట్టబద్దత కల్పిస్తాం. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. పార్లమెంటులో బిల్లు ఆమోదం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం చేస్తాం.
రాష్ట్ర ప్రతినిది బృందంగా ప్రధామంత్రిని, కేంద్ర పెద్దలను, అన్ని పార్టీల వారిని కలుస్తాం. బీసీల కలను నిజం చేసే ప్రక్రియను మొదలుపెడుతున్నాం. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకువెళ్తాం.
మేము చేసే ప్రయత్నంలో మేధావులు, పౌరులు కలిసి రావాలి. సర్వేలో పాల్గొనని వాళ్ళు మాట్లాడటం హాస్యాస్పదం. తమకు జనాభా ప్రకారం అవకాశాలు ఇవ్వాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడం కోసం మేము.. చేయాల్సిన ప్రయత్నం చేస్తాం. మా రిజర్వేషన్లు తేల్చాలని బీసీలు అడుగుతున్నారు.
బీసీల లెక్క తేల్చాలన్నది మా ప్రధాన ధ్యేయం. ఆర్ధిక సంఘం నుండి పంచాయతీలకు రావాల్సిన నిధులు ఆగినా రాష్ట్ర ప్రభుత్వంగా మేము భారాన్ని మోస్తాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి బీసీల రిజర్వేషన్లు సాధిస్తాం. అన్ని లెక్కలు పకడ్బందీగా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. బీసీలకు మేలు జరగాలని భావిస్తే అందరూ కులగణనలో పాల్గొనాలి. మేము 56 శాతం బీసీల ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం”.. అని భట్టి విక్రమార్క అన్నారు.