బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబయిలో సల్మాన్ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
గత ఏడాది మార్చిలో సల్మాన్ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈమెయిల్స్ వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ముంబయి పోలీసులు.. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఏప్రిల్లోనూ ఇదే తరహా బెదిరిం పుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎక్స్ గ్రేడ్ భద్రతను Y+ గా అప్గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్కు నిత్యం భద్రతగా ఉంటున్నారు.గతంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. 1998లో కృష్ణ జింకను వేటాడి తమ మనోభావాలను కండల వీరుడు దెబ్బతీశాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. దీంతో ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు.