స్వతంత్ర వెబ్ డెస్క్: కళ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అసరం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వానాకాలంలో వైరల్ ఫీవర్లతో పాటుగా సోకే ఈ తరహా ఇన్ఫెక్షన్ల వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏమి సంభవించబోవని వైద్యనిపుణులు చెబుతున్నట్లు తెలిపారు. కళ్లు ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారడం, వాపు రావడం వంటివి కళ్ల కలక ముఖ్య లక్షణాలుగా గుర్తించారని, దీని పట్ల అప్రమత్తంగా ఉంటే సరిపోతుందన్నారు. కళ్ల కలక, ఇతర సీజనల్ వ్యాధుల పట్ల తెలంగాణ వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తతో ఉందన్నారు. పలు జిల్లాల్లో కళ్ల కలక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని విభాగాల ఉన్నతాధికారులు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సహా అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి హరీశ్ రావు వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కళ్ల కలక పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆసుపత్రుల్లో పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండ్లదే అని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెకానిజం తప్పకుండా పాటించాలన్నారు. ఆసుపత్రిల వారీగా ఏర్పాటు చేసుకున్న ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ప్రతి సోమవారం సమావేశమై, చర్చించుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ నిబంధనలు పాటించేలా జిల్లా వైద్యాధికారులు చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కొనసాగించాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఎయిర్ ఫిల్టర్లు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మహిళ సమగ్ర ఆరోగ్యం కోసం మంగళవారం నాడు నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ క్లినిక్స్ పనితీరును డీఎంహెచ్వో, ప్రోగ్రాం ఆఫీసర్లు మానిటరింగ్ చేయాలన్నారు.