వైసీపీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అసమ్మతి సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంత్రులు రోజా, అంబటికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు శపథాలు చేస్తున్నారు. ఎత్తులు, పొత్తులతో విపక్షాలు ముందుకు వెళుతున్న వేళ…పార్టీలో అందరూ ఏకతాటిపై నడవాల్సిన సమయంలో.. అసమ్మతి సెగ చెలరేగడంపై వైసీపీ అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసింది. మంత్రులు, అసమ్మతి నేతలతో సీఎం జగన్ చర్చలు జరిపి, అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లో విడుదల కానున్నట్టు తెలిసింది. ఈలోపునే అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా, మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఒకవైపు ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతుంటే మరోవైపు పార్టీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి.
వచ్చే ఎన్నికల్లో చాలా చోట్ల సిటింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులకు టికెట్లు ఇస్తే వారిని ఓడిస్తామంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసమతి సెగ ఎదుర్కొంటున్న వారిలో మంత్రులు అంబటి రాంబాబు, రోజాతో పాటు ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలను సీఎం జగన్ , పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే, ఎన్నికల ముందు మరోసారి అసమ్మతివాదులు పార్టీ నేతలపై నిరసన గళం వినిపించారు.
నగరి ఎమ్మెల్యే రోజా, జగన్ క్యాబినెట్ లో టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రోజా సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి సెగ ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో అవినీతి తాండవిస్తోందని, ఏ పని జరగాలన్నా సొమ్ములు చెల్లించాల్సి వస్తోందని అసమ్మతివాదులు అంటున్నారు. మరోవైపు రోజాకు, పార్టీ సీనియర్ నేతలు కేజే శాంతి, చక్రపాణి రెడ్డిలకు మధ్య వైర వాతావరణం తీవ్ర స్థాయికి చేరింది. గతంలో సీఎం జగన్ నగరి పర్యటిస్తున్న సందర్భంలో మంత్రి రోజా, పార్టీ సీనియర్ నేత కేజే శాంతి మధ్య సయోధ్య కుదిరించేందుకు స్వయంగా ప్రయత్నం చేశారు. అయితే, అప్పట్లోనే మంత్రి రోజాతో చేయి కలిపేందుకు కేజే శాంతి ముందుకు రాలేదు. ఈ అంశం అప్పట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రోజాకు వ్యతిరేకంగా నియోజకవర్గ సర్పంచ్ లు, ఎంపీటీసీలు నిరసన గళం విప్పారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వవద్దని వైసీపీ అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రోజాకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. అటు సొంత నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రితో, ఇతర నేతలతో మంత్రి రోజాకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో నియోజకవర్గంలోని పరిస్థితులను మంత్రి రోజా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, అటు అసమ్మతి నేతలను, ఇటు మంత్రి రోజాను క్యాంప్ క్యాంప్ కార్యాలయానికి పిలిపించి మరోమారు చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్ గట్టిగా చెప్పినట్టు సమాచారం.
మరో మంత్రి అంబటి రాంబాబు సైతం సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నియోజకవ ర్గంలో పార్టీ నేతలను పట్టించుకోవడంలేదని ఆయనపై అసమ్మతివాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుంగా, ఆయన తీరు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అసమ్మతి నేతలు మండిపడుతున్నారు. ఇదేకాక, అక్రమ మైనింగ్ వంటి అంశాలు మంత్రి అంబటి రాంబాబు ను ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మంత్రికి టికెట్ ఇస్తే ఆయనను ఓడిస్తామని స్థానిక నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని అసమ్మత నేతలను, మంత్రి అంబటి రాంబాబును క్యాంప్ కార్యాలయా నికి పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిరించేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి నియోజ కవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరికి టికెట్ ఇవ్వాలని వైసిపి అధిష్టానం భావించినట్టు తెలిసింది. అయితే, అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆ నేత సుముఖత వ్యక్తం చేయకపోవడంతో… అంబటి నే సత్తెనపల్లిలో కొనసాగించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ని నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలు తీవ్రంగా విభేదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గోపిరెడ్డికి టికెట్టు ఇవ్వొద్దని ఆయన వ్యతిరేకవర్గం గతంలో పార్టీ ఆఫీస్ తో పాటు సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది .దీంతో పార్టీ పెద్దలు ఇరువర్గాలను పిలిచి వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలనిసూచించారు . అప్పట్లో ఆ ఆందోళన సర్దుమణిగినా ఎన్నికల వేళ మళ్లీ అసమ్మతిసెగ తలెత్తింది. దీంతో, సిట్టింగ్ ఎమ్మెల్యేని, ఆయన వ్యతిరేక వర్గం నేత గజ్జల బ్రహ్మానందరెడ్డి ని క్యాంప్ కార్యాలయానికి పిలిపించి సీఎం జగన్ చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు వైసీపీలో నెలకొన్న విభేదాలు ఆ పార్టీపై వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. సీఎం జగన్ అసమ్మతి నేతలకు నచ్చ చెప్పినా ఎంతమంది నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వ్యతిరేక వర్గానికి సహకరిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.


