స్వతంత్ర వెబ్ డెస్క్: జనగామ బీఆర్ఎస్(BRS) టికెట్పై సస్పెన్స్ కొనసాగుతున్నది. కేసీఆర్ సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికీ జనగామ(Jangaon) స్థానాన్ని పెండింగ్ పెట్టారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy) ఆలోచనలో పడిపోగా, అతడి వర్గీయులు నైరాశ్యానికి లోనయ్యారు. జనగామ స్థానంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి(Palla Rajeshwar Reddy), స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) ఆశించి ఎవరికి వారుగా వ్యవహరిస్తుండటంతో వివాదాలు తలెత్తాయి.
దీంతో నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పరిశీలన కోసం పెండింగ్ పెట్టారు. పార్టీ అంచనాలు, సర్వేలు, అంతర్గత అవగాహనతో వడబోత చేపట్టి మరో రెండు, మూడురోజులలో నిర్ణయం తీసుకుని అభ్యర్థిని వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన క్రమంలో జనగామ టికెట్ ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ముత్తిరెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ విషయమై సోమవారం ఎమ్మెల్సీ కవితను ఆయన కలిసినట్లు తెలిసింది. అయితే సీఎం కేసీఆర్పై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదేశానుసారం నడుకుంటానని తెలిపారు.