స్వతంత్ర వెబ్ డెస్క్: ఆదిలాబాద్ కాంగ్రెస్లో(Congress) వర్గపోరు రచ్చకెక్కింది. కాంగ్రెస్ బీసీ సభలో(BC Sabha) నేతల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు( V Hanumantha Rao) సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్లో కాంగ్రెస్ బీసీ సభకు వీహెచ్ హాజరయ్యారు. అయితే సభకు హాజరయ్యేందుకు వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డిని( Kandi Srinivas Reddy) సాజిద్ ఖాన్(Sajid Khan) వర్గం అడ్డుకుంది. దీంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి కొత్తగా వచ్చారని.. ఒరిజినల్ కాంగ్రెస్ ఆచారాలు తెలుసుకోవాలని.. సీనియర్ నేతలపై ఆధిపత్యం చెలాయించాలంటే కుదరదని అన్నారు. ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి చేసింది తప్పని.. మిగిలిన విషయాలను కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఎన్నికల్లో టికెట్ ఎవరికనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఇక, కంది శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఇతర సీనియర్ నాయకులు ఈ పరిణామాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆదిలాబాద్ కాంగ్రెస్లో వర్గపోరు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.