కుమురం భీం జిల్లాలో ఆపరేషన్ గజ ముగిసింది. ఇద్దరు రైతులను హతమార్చి మూడు రోజులపాటు హడలెత్తించిన ఏనుగు ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. పెంచికల్పేట్ మండలం మొర్లిగూడ, జిల్లెడగుట్ట అటవీ ప్రాంతంలో నిన్మ మధ్యాహ్నం వరకు సేదతీరిన ఏనుగు.. సాయంత్రం 6 గంటల తర్వాత జిల్లెడ మార్గం గుండా ప్రాణహిత దాటి పొరుగు రాష్ట్రంలోని చిన్నవట్ర గ్రామం వైపు వెళ్లినట్లు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు. గజరాజు జిల్లా నుంచి తరలివెళ్లడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
53 గంటల పాటు తిరుగుతూ ప్రతి ఒక్కరికి నిద్రలేకుండా దడ పుట్టించింది. గడ్చి రోలి జిల్లా మీదుగా ప్రాణహిత దాటి.. తెలంగాణ లోని కొమురం భీం జిల్లా చింతల మానే పల్లి మండలం బూరెపల్లి గుండా ఏనుగు ప్రవేశించింది. అక్కడే శంకర్, కొండ పల్లిలో మోటారు ఆన్ చేయడానికి వెళ్లిన పోచయ్యను అనే ఇద్దరు వ్యక్తులను తొక్కి చంపింది. కేవలం 24 గంటలు గడవక ముందే ఇద్దరి ప్రాణాలు తీసింది. దీంతో పారెస్ట్ అధికారులు ఏనుగు కోసం డ్రోన్ కెమరాలతో సర్చ్ ఆపరేషన్ చేశారు. స్థానికులను అలర్ట్ చేశారు. ఎవరు పొలాలకు వెళ్లొద్దని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.మరుసటి రోజు ఉదయాన్నే పెంచికల్ పేట మండలం కమ్మర్ గాం వద్ద ఏనుగు కనిపించింది. అక్కడి నుంచి జిల్లేడ మీదుగా ప్రాణహిత దాటి మహారాష్ర్ట లోకి ప్రవేశించింది. దారి తప్పి తెలంగాణలో ప్రవేశించిన ఏనుగు ఎట్టకేలకు అదే మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో అటవీ శాఖ అధికారులు, అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో 53 గంటల పాటు 70 నుంచి 80 కిలో మీటర్లు ఏనుగు సంచరించింది. మళ్ళీ తిరిగి మహారాష్ట్ర వెళ్లడంతో తెలంగాణ సేఫ్ జోన్ కి వచ్చేసింది. మూడు రోజుల నుంచి ఏనుగు కోసం సర్చ్ ఆపరేషన్ టీంలు సరిహ ద్దుల్లోనే పాగా వేశారు. ప్రాణహిత నది పరిసర ప్రాంతాల్లో ఏనుగు అడుగు జాడలను అధికారులు గురించి ఏనుగు సరిహద్దు దాటడంతో ఊపిరి పీల్చుకున్నారు.


