సార్వత్రిక ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. జూన్ ఒకటితో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు పూర్తికాను న్నాయి. అయితే, ఓవైపు ఎన్డీఏ కూటమి అధికారం మాదేనని అంటుంటే మరోవైపు ఇండియా కూటమి పవర్ విషయంలో ధీమాగా ఉంది. అంతేకాదు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు కూటమి సభ్యులు జూన్ ఒకటిన సమావేశం కాబోతున్నారు. దీంతో ఏయే అంశాలపై వీరు చర్చించబో తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు వచ్చేశాయి. ఇప్పటికే ఆరువిడతల పోలింగ్ పూర్తయింది. ఇక, మిగిలింది ఏడో విడత మాత్రమే. చివరి విడత పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఆ రోజే విపక్షాలకు సంబంధించిన ఇండియా కూటమి సమావేశం కానుంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆఖరి దశ జరిగే రోజే ఈ సమావేశం జరగనుండడంతో ప్రాధాన్యం సంత రించుకుంది. ఈ మేరకు కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలంతా హస్తినలో జరిగే సమావేశానికి హాజరు కావాలని వర్తమానం పంపారు. పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. త్వరలోనే ఆయన బెయిల్ గడువు పూర్తై మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. దీంతో సరిగ్గా ఆయన కారాగారంలోకి వెళ్లే ముందు రోజే ఈ భేటీ నిర్వహిస్తుండడం ఆసక్తి రేపుతోంది.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సహా ఇండియా కూటమికి చెందిన ఇతర కీలక నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో కనబ రిచిన పనితీరు, వచ్చే సీట్లకు సంబంధించిన లెక్కలు, విపక్ష కూటమి నేతలు తమ రాష్ట్రాల్లో కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు ఇతరత్రా అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరం, తూర్పు, పశ్చిమ, మధ్య భారతం అన్న తేడాలేకుండా ఎక్కడ చూసినా ఇండియా కూటమి హవా కన్పిస్తోందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతామని చెప్పుకొచ్చారాయన. అయితే, విపక్షాల విమర్శలు, అధికారపక్షం కౌంటర్ల సంగతి ఎలా ఉన్నా, సరిగ్గా ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందు విపక్షాల ఇండియా కూటమి సమావేశం కావడం మాత్రం ప్రాధాన్యం సంతరిం చుకుంది.