సైబర్ నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పోలీస్ శాఖ కూడా వారి వలలో చిక్కిందంటే సైబర్ నేరగాళ్లు ఎంత కేటుగాళ్లో ఇట్టే అర్థమైపోతుంది. ఖాకీలనే బురిడీ కొట్టించి డేటాను దొంగలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే, ఎట్టకేలకు హ్యాకర్ను అరెస్ట్ చేసి కటకటాలకు తరలించింది తెలంగాణ పోలీస్ యంత్రాంగం. ఇంతకీ ఎవరా కేటుగాడు..? హ్యాక్ అయిన డేటా ఏంటి.?
మోసం ఏదైనా న్యాయం కోసం ఆశ్రయించేది పోలీసులనే. మరి ఆ పోలీసులే కిలాడీ చేతులకు చిక్కితే అనుమానమే లేదు. అదే జరిగింది. ఓ సైబర్ నేరగాడు ఖాకీలను బురిడీ కొట్టించి యాప్ను హ్యాక్ చేయడమే కాదు అమ్మేశాడు కూడా. సైబర్ నేరాలలో ఆరి తేరిన జాతిన్కుమార్ పోలీస్శాఖ వెబ్సైట్, యాప్లపై కన్నేశాడు. కిలాడీ తెలివితేటలన్నీ ప్రదర్శించి, రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కీలకమైన హాక్ ఐ, టీఎస్ కాప్, ఎస్ఎంఎస్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడి కొంత డేటాను తోటి హ్యాకర్లతో కలిసి దొంగలిం చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరగాడి కోసం విస్తృతంగా గాలించి చివరకు ఢిల్లీలో పట్టుకుని అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధిం చిన పూర్తి వివరాలను వెల్లడించారు డీజీపీ రవిగుప్తా. జతిన్కుమార్ ఢిల్లీలో రహస్య ప్రదేశంలో ఉండగా జీపీఎస్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. హ్యాక్ ఐ అప్లికేషన్లో ఉన్న డేటా ఆధారంగా డబ్బుల కోసం దొంగలించిన డేటాను పబ్లిక్ ఫ్లాట్ ఫారంలో పోస్ట్ చేసి అమ్మకానికి పెట్టాడని తెలిపారు.
సైబర్ నేరగాడు జతిన్కుమార్పై ఢిల్లీలో చాలా కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు తెలంగాణ పోలీసులు. గత ఏడాది నిందితుడు ఆధార్ కార్డులకు సంబంధించి డేటా ఇతర ఏజెన్సీలకు సంబంధిం చిన సమాచారం లీక్ చేశారని వారు తెలిపారు. న్యూ ఢిల్లీలోని స్పెషల్ సెల్ ద్వారక పోలీస్ స్టేషన్ ద్వారా పలు సెక్షన్ల కింద ఇదివరకు జతిన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ కేసులో ప్రమేయం ఉన్న అదనపు సహచరులను గుర్తించే ప్రయత్నాలతో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ఇకపోతే ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన ఆర్థిక డేటా లీక్ కాలేదని తెలిపారు డీజీపీ రవిగుప్తా. హ్యాక్ ఐ మొబైల్ అప్లికేషన్ డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఇమెయిల్ IDల వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని ప్రాథమికంగా, బలహీనమైన పాస్వర్డ్ కారణంగా, చొరబాటుదారుడు నివేదికను రూపొందించడం ద్వారా హక్ ఐ డేటాలోని నిర్దిష్ట విభాగాలకు యాక్సెస్ని పొంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
TSCOPలో సమాచారం సేఫ్గా ఉందని, థర్డ్ పార్టీ డేటా అమ్మారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు డీజీపీ రవిగుప్తా. హైదరాబాద్ సిటీ పోలీస్ SMS, సర్వర్స్ URL విషయంలో సైబర్ నేరగాళ్లు చొరబడ్డారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎందుకంటే URL ఏప్రిల్ 2022 నుంచి పనిచేయ లేదని, హైదరాబాద్ సిటీ పోలీసులు దాని వినియోగాన్ని చాలాకాలం ముందే నిలిపే శారని తెలిపారు. హ్యాకింగ్పై భద్రతాపరమైన లోపాలు ఉన్నాయేమోనని పరీక్షిస్తున్నామన్నారు. భవిష్యత్తు లో ఇలాంటి హ్యాకింగ్స్ నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయెల్ పర్యవేక్షణలో తక్కువ టైంలోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపిన ఆయన కేసుని ఛేదించిన పోలీస్ అధికారులను అభినందించారు. ఇలా మొత్తానికి ఖాకీలనే బురిడీ కొట్టించిన కేటుగాడు చివరికి వారి చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటనతో మరోసారి పోలసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి కిలాడీగాళ్ల బారినపడి మోస పోవద్దని హెచ్చరిస్తోంది పోలీస్ శాఖ.