2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం తీరు మారింది. విపరీతంగా ఉన్న ఎండతీవ్రతకు ప్రచారం హీట్ హెచ్చడంతో పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రచారానికి తక్కువ టైం ఉండటంతో అభ్యర్దులు ప్రచార వ్యూహాలను మార్చేస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని బంద్ చేసేశారు. ఒకే సారి ఎక్కువ మందిని కలిసేలా కులాల వారీగా సమావేశాలు, రోడ్షో లు, కార్నర్ మీటింగ్లు వంటి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖర్చు తగ్గించుకో వడంపై కూడా ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు ఉన్న టైంలోనే అన్ని నియోజకవర్గాలు కవర్ చేయాలన్న లక్ష్యంతో అభ్యర్దుల కుటుంబ సభ్యులు సైతం
రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ఉదయం, సాయంత్రం తప్ప మధ్యాహ్నం బయట కాలు పెట్టలేని పరిస్ధితి. ప్రచారానికి ఇక పదిరోజులు కూడాలేకపోవడంతో అభ్యర్దులు తమ ప్రచారం తీరు మార్చారు. ప్రచారానికి కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. వాకింగ్ చేస్తున్న వారిని కలిసేందుకు ఉదయమే పార్కులు, గ్రౌండ్ లు, స్టేడియాలకు పరుగులు తీస్తున్నారు. తర్వాత రైతులు, కూలీలు, కార్మికులను నేరుగా కలిసేందుకు మార్కెట్లకు వెళ్తున్నారు. అప్పటికే ఎండ తీవ్రత పెరగడంతో ఇంటింటి ప్రచారాలకు వెళ్లడంలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏసీ ఫంక్షన్స్ హాల్స్లో సమావేశాలు పెడుతున్నారు. సాయంత్రం మళ్లీ ఎండ తీవ్రత తగ్గగానే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతోపాటు చిన్న చిన్న సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్ధానాలు ఉండటంతో పూటకో నియోజకవర్గం చొప్పున అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోపక్క కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి వారితో ప్రచారాలు చేపట్టి ఎక్కువ ప్రాంతాలు కవర్ అయ్యేలా చూసుకొంటున్నారు.
ఎన్నికల ప్రచారానికి పదిరోజులు కూడా వ్యవధి లేదు దీంతో టైం మేనేజ్మెంట్తో పాటు, ఖర్చు తగ్గింపుపై అభ్యర్దులు దృష్టి పెట్టారు. అన్ని మండలాలు, గ్రామాల్లో కార్యకర్తలతో టీమ్ ఏర్పాటు చేసి రెగ్యులర్గా ఇంటింటి ప్రచారం చేయడం ఖర్చుతో కూడిన పని. ఇలా ప్రతి రోజు వేలాది మందితో ప్రచారం చేయాలంటే క్యాండిడేట్లు భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 50 నుంచి 60 మండలాల్లో 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఓటర్లను డైరెక్టుగా కలవడం తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో తక్కువ మంది కార్యకర్తలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేసు కుంటున్నారు. ఇందులో భాగంగా ఆటోలు, మినీ వ్యాన్లకు ఫ్లెక్సీలను కట్టించి సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రచారానికి తిప్పుతున్నారు. మరో వైపు ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను చేర్చు కోవడంపైనా దృష్టి పెట్టారు. ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకం ఉన్న అభ్యర్ధులు మాత్రం కాస్త ధైర్యంగా డబ్బు ఖర్చు చేస్తుండగా మిగిలిన వారు మాత్రం కాస్త ముందు వెనకా ఆలోచించి ఖర్చు పెడుతున్నారు.


