Badradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చుంచుపల్లి మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా వస్తున్న బొగ్గు లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టగా బస్సు బోల్తాపడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 43 మంది గాయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కొత్తగూడెం దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భద్రచాలం నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.