గంజాయి తాగించి దొంగతనాలు చేయిస్తున్న ముఠా గుట్టురట్టు రట్టైంది. అమాయక పిల్లలకు మత్తుమందు ఇచ్చి వారిని దొంగలుగా మారుస్తున్న ముఠా వ్యవహారం ఓ బాధితుడి ఫిర్యాదుతో బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేట పట్టణానికి చెందిన షేక్ షారుక్ అలియాస్ షారుక్, ఫారూక్ అన్నదమ్ములు. పిల్లలను డ్రగ్స్, గంజాయికి బానిసలుగా చేయడం, ఆ తర్వాత వారిచేత సెల్ ఫోన్ దొంగతనాలు చేయించడం, వారితో గంజాయి రవాణా చేయించడం వృత్తిగా మార్చుకున్నారు. వరవకట్టకు చెందిన ఈ అన్నదమ్ములు షారూక్, ఫారూక్… ఇప్పటికి సుమారు 150 దొంగతనాలు చేయించినట్లు తెలుస్తోంది.
వీరి ఉచ్చులో పడిన జమీ మీరావలి రెండు నెలల క్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. జువైనల్ హోంలో శిక్ష అనుభవించి ఇంటికి తిరిగివచ్చాడు. మళ్లీ దొంగతనాలు చేయాలంటూ ఫారూఖ్, షారూక్ అతనిని వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపులు తాళలేక జమీర్ మీరావలి పోలీసులను ఆశ్రయించాడు.
మత్తు పదార్థం ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నామో కూడా తెలియక వాళ్ళు చెప్పింది చేస్తున్నామని బాధితుడు జమీర్ మీరావలి పోలీసులకు చెప్పాడు. దొంగతనాలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. అమాయకులైన చిన్న పిల్లలను టార్గెట్ చేసుకున్న వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు కోరారు. బెదిరింపుల నుండి కాపాడాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకి బాధితుడు ఫిర్యాదు చేశాడు.