ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ప్రోత్సహించినట్లు చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు దావోస్లో పర్యటిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్బంగా జ్యూరిచ్లో అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. యూరప్లోని 12 దేశాల నుంచి వ్యాపారవేత్తలు ఈ సమావేశానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తెలుగువారుంటారని, అవకాశం ఉన్న ప్రతిచోటుకీ మనవాళ్లు వెళ్లిపోతారని చెప్పారు.
అన్ని దేశాల్లో తెలుగువాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుందన్నరు. తెలుగువాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారని చంద్రబాబు చెప్పారు. పట్టుదల ఎక్కువ. నైపుణ్యాలు పెంచుకుంటారు. నేను తాను జైల్లో ఉన్నప్పుడు అనేక దేశాల్లోని తెలుగువాళ్లు నిరసన తెలిపారని అన్నారు. అప్పుడు ఇన్ని దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారా? అని ఆశ్చర్యపోయాయని అన్నరు. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పరు. యువతలో సరికొత్త ఆలోచనలు రావాలి… చైతన్యవంతులు కావాలని చంద్రబాబు సూచించారు.
హైదరాబాద్లో భూములకు మంచి ధర వస్తుందని ఆనాడే చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు. భూములు అమ్ముకోవద్దని సూచించానని అన్నారు. తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయానికి హైదరాబాద్ సంపదే కారణమని వెల్లడించారు. ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని… యువత గ్రామాల నుంచి నగరాలకు వచ్చి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి, ఐటీ రంగంలోకి వచ్చారని తెలిపారు. చదువులో ఆడపిల్లలపై వివక్ష చూపించొద్దని … ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి వెళ్లినా అమ్మాయిలు కనిపిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం యువకుల కంటే యువతులకే ఎక్కువ ఆదాయం వస్తోందని పేర్కొన్నారు వాస్తవానికి పురుషుల కంటే మహిళలే తెలివైన వాళ్లు… పరిశోధనలు కూడా అదే చెబుతున్నాయని చంద్రబాబు తెలిపారు..
2047 నాటికి తెలుగువాళ్లు గొప్పగా ఉండాలనేదే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. తెలుగు వాళ్లకు ప్రత్యేక గుర్తింపు రావాలన్నారు. తెలుగువాళ్లు అనేక కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చారని… ఉక్రెయిన్లో సమస్య వచ్చినప్పుడు ప్రవాసాంధ్రులు బాగా పని చేశారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా మన మూలాలు మరిచిపోకూడదన్నరు. ఎంతో పోరాడి మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్లో పెట్టించానని గుర్తు చేశారు. మన రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్న చంద్రబాబు.. ప్రవాసాంధ్రులను ఎలా ప్రోత్సహించాలన్న దిశగా ఆలోచన చేస్తున్నామని అన్నారు. నిరంతర శ్రమ వల్లే తెలుగువాళ్లు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని చెప్పారు.
ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ వేగంగా పెరుగుతోందని… ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్గా చేయాలనేది తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు.