Andhra Pradesh | పల్నాడు జిల్లా అమరావతిలో ఉద్రిక్తత నెలకొంది. ఇసుక అక్రమ తవ్వకాలపై వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఒకరినొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఆదివారం 9 గంటలకు అమరలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని అన్నారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రమాణం లేదా బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఇద్దరు నేతల సవాళ్లతో పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం మోదయ్యింది. తీవ్ర పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ క్రమంలో అమరేశ్వర ఆలయంలోకి ప్రవేశించేందుకు టీడీపీ కార్యకర్తలు, నేతల ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. బహిరంగచర్చ కోసం రోడ్డు మీదకు వచ్చి వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆలయంలోనికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై రాళ్ళు రువ్వారు టీడీపీ కార్యకర్తలు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఏదేమైనా దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యే శంకర్రావు సవాల్ విసరడంతో పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.


