స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్రారంభించారు. ముందుగా అమరవీరులకు పోలీసులు గన్ సెల్యూట్ నిర్వహించగా.. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు , ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అమర జ్యోతిని కేసీఆర్ ప్రారంభించగా.. అనంతరం అమరవీరులపై ప్రదర్శించిన ప్రదర్శనను సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధా కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగానికి గుర్తుగా నిర్మించిన ఈ అమరుల స్మారక కేంద్రంలో విశాలమైన సభా మందిరం, ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్, ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫోటో గ్యాలరీ, ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. మూడున్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తులో అమరుల స్మారకం ఏర్పాటు చేశారు. రూ. 178 కోట్ల వ్యయంతో పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్తో ప్రమిద, దీపం ఆకృతిలో స్మారకాన్ని నిర్మించారు. ప్రజ్వలన దీపం నమూనాను కళాకారుడు రమణారెడ్డి రూపొందించారు. మొదటి 2 బేస్మెంట్లలో 2.14 లక్షల చదరపు అడుగుల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రదర్శనల కోసం స్థలం కేటాయించారు. మొదటి అంతస్తులో అమరుల ఫోటో గ్యాలరీ, మినీ థియేటర్, రెండో అంతస్తులో 500 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, మూడో అంతస్తులో చుట్టూ అద్దాలతో అద్దాల పైకప్పు నిర్మించారు.