లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల యుద్ధం మొదలవుతుండడంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు చక్కబెడుతూనే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగం గానే అన్ని పార్టీల కంటే ముందుగా సీఎం రేవంత్ స్వయంగా తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. అయితే రొటీన్కు భిన్నంగా సీఎం రేవంత్ అభ్యర్థిని ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎంపీ అభ్యర్థులను రేవంత్ రెడ్డే ఫైనల్ చేయనున్నారా..? హైకమాండ్ రేవంత్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి నట్లేనా..?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అదే జోష్ను కొనసాగించాలని చూస్తోంది. లోక్సభ ఎన్నికలకు రెండు నెలలే సమయం ఉండడంతో అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందుకేసి తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎంపీ అభ్యర్థిని ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశారు. నారాయణపేట జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కొడంగల్ సభలో పాల్గొన్న రేవంత్.. పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును స్వయంగా ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ప్రజలు వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని..తన నియోజకవర్గంలో 50 వేల అధిక్యత వచ్చేలా చేయాలని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ సాంప్రదాయానికి భిన్నంగా సీఎం రేవంత్రెడ్డి ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. రేవంత్ ప్రకటన పార్టీ కేడర్ను కూడా షాక్కు గురిచేసిందని అంటున్నారు. సాధాణంగా టీ.పీసీసీ రాష్ట్ర స్థాయి నేతలు పంపిన జాబితా ప్రకారం కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ప్రకటిస్తుంది. కానీ, సీఎం రేవంత్రెడ్డి తొలిసారి అభ్యర్థిని ప్రకటించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశ మైంది. దీంతో ఎంపీ అభ్యర్థుల విషయంలో సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా అనే చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే మరికొంత మంది అభ్యర్థులను కూడా సీఎం రేవంత్రెడ్డే ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది పేర్లు కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. దీంతో ఆశావహులు హైకమాండ్తో పాటు సీఎం రేవంత్ దగ్గర లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం భట్టితో సహా జిల్లా ముఖ్య నేతలు అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డిని ప్రకటించారని అంటున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఏడు సీట్లు గెలిచింది. అంతేకాకుండా సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో స్వయంగా రేవంత్రెడ్డి ఎంపీ అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది.పైగా సౌమ్యుడిగా పేరున్న వంశీచందర్రెడ్డిని ప్రకటిం చడంపై అధిష్టానం కూడా అభ్యంతరం చెప్పదన్న భావనతోనే సీఎం ఆయన పేరు ప్రకటించి ఉంటారని చెబుతున్నారు. ఇక.. వంశీచంద్ రెడ్డి విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 78 ఓట్ల స్వల్ప అధిక్యంతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి వంశీచంద్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అయితే తాజాగా రేవంత్రెడ్డి ప్రకటనతో వంశీచంద్రెడ్డి మరోసారి మహబూబ్నగర్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలవనున్నారు. అటు మిగతా పార్టీలు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. మరి ఈ సారి ఎన్నికల్లో పాలమూరు ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.


