వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ అనగానే గుర్తుకు వచ్చేది మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని. పార్టీపరంగా మంచి వక్తగా రోజాకు పేరుండగా, కొడాలి నానికి డేరింగ్ ఫెలోగా పేరుంది. స్వపక్షంలో ఈ నేతలకు ఈ విధంగా కితాబు ఉండగా, విపక్ష నేతలు మాత్రం వీరిపై విమర్శలు గుప్పిస్తారు. స్వపక్షం, విపక్షం మాట అలా ఉంచి ప్రజాపక్షంలో ఈ నేతల పేరు ఎలా ఉంది…? ఈవిఎంలలో నిక్షిప్తమై ఉన్న వీరి భవిత ఎలా ఉండబోతోంది..? ఈ ఇద్దరి నేతల గురించి విస్తృతంగా ఎందుకు చర్చలు జరుగుతున్నాయి.
ఏపిలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే నేతల భవిష్యత్ ను ఓటర్లు ఈవిఎంలలో నిక్షిప్తం చేశారు. ఇదిలా ఉండగా, ఏపి ఎన్నికల్లో గెలుపు ఓటముల పై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. అయితే, టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారే గెలుపు పై ధీమా గా వున్నారు. పార్టీల గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో కొందరి నేతల రాజకీయ భవిత పైనా చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాల కృష్ణ తదితర పెద్ద నేతల గెలుపు, ఓటములపైనా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు అధికార వైసీపీ లోని ఒకరిద్దరు మంత్రులు, మాజీ మంత్రులు గెలుపు ఓటములపై సాగుతున్న చర్చలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఫైర్ బ్రాండ్స్ అనగానే గుర్తుకు వచ్చే పేరు మంత్రి రోజా. సహజంగా మంత్రి రోజా ప్రతి పక్షాల పై దూకుడు గా రాజకీయ విమర్శలు చేస్తూంటారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలా అవతల ఉన్న ఏ గొప్ప నేతపైనైనా రోజా ఘాటు విమర్శలు చేస్తూంటారు. దీంతో, ప్రతిపక్షాలకు రోజా టార్గెట్ గా మారారు. అయితే, వాగ్బాణాలు, మాటల తూటాలు, విమర్శలు, ప్రతివిమర్శలు విపక్షాలతో జరగడం సాధారణ విషయమే.అయితే, రోజాకు సొంత పార్టీలోను, సొంత నియోజకవర్గంలోను శతృవర్గం ఏర్పడింది. కారణం ఏమైనా రోజా, ఎన్నికల సమరంలో ఇంట, బయట పోరాటం సాగించాల్సి వచ్చింది. సొంత పార్టీ వారే తమకు వ్యతిరేకంగా పనిచేశారని సాక్షాత్ రోజాయే వెల్లడించారు. ఈ నేపథ్యంలో రోజా ఈ ఎన్నికల్లో గెలుస్తారా.. లేదా అనే చర్చలు సాగుతున్నాయి. 2014 ,2019 ఎన్నికల్లో నగరి నియోకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు రోజా విజయం సాధించారు. అయితే, ప్రజల మనస్సుల్లో రోజాపై ఏ అభిప్రాయం ఉంది..? మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారా పరాజయం పాలై పక్కకు తప్పుకుంటారా..? ఎక్కడ చూసిన ఈ రీతిగా చర్చలు కొనసాగుతున్నాయి.
ఇక వైసీపీలో మాజీ మంత్రి కొడాలి నానికి ఉన్న క్రేజీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కొడాలి నోరు తెరిస్తే ప్రతిపక్షాలు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నాని వాగ్దాటి ఆ రీతిలో సాగుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆయనకు రాజకీయంగా టార్గెట్. ఉచితానుచితం అనే తేడాలేమీ చూడకుండా విపక్ష నేతలపై ఆయన విమర్శలు గుప్పిస్తారు. టీడీపీ నేతలు సైతం అధిక సమయాన్ని కొడాలి నానిపై పోరుకే
వెచ్చిస్తారని వ్యాఖ్యానాలు వినిపిస్తాయి. గుడివాడ నియోజక వర్గం నుంచి కొడాలి నాని వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. 2004, 2009 లో తెలుగుదేశం తరఫున కొడాలి నాని పోటీ చేసి విజయం సాధించారు. 2014, 2019 లో వైఎస్ఆర్ సీపి నుంచి పోటీ చేసి కొడాలి నాని గెలిచారు.
గతంలో మూడు సార్లు కొడాలి నాని విజయం సాధించినా ఆయన గెలిచిన పార్టీ ప్రతి పక్షానికి పరిమితం అయింది. అయితే, 2019 లో మాత్రం వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కొడాలి నాని ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు, మంత్రి పదవినీ దక్కించుకున్నారు. కొడాలి నాని మంత్రి అయ్యాక పలు వివాదాలు ఆయన్ని చుట్టూ ముట్టాయి. ముఖ్యంగా గుడివాడ నియోజక వర్గంలో పేకాట శిబిరాలు నిర్వహణ, సంక్రాంతి సందర్భంగా కేసినో నిర్వహణ వంటి అంశాలు ఆయనకు తీవ్ర వ్యతిరేకత తెచ్చి పెట్టాయి. ఈ సారి టీడీపీ తరఫున ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము ఎన్నికల బరిలో నిలిచారు. తాను విజయం సాధిస్తే యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతానని రాము ఎన్నికల ప్రచారం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుడివాడ లో రసవత్తర పోటీ జరిగింది. గుడివాడ నుంచి అయిదోసారి ఎన్నికల బరిలో దిగుతున్న కొడాలి నాని గెలుస్తారా..? లేదా.. ఈ నియోజకవర్గంలో విజేతలు ఎవరు.? పరాజితులెవరు.? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే, జూన్ 4 వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ లో వీరి భవితవ్యం తేలనుంది.వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అయితే, మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని గెలుపు, ఓటములపై వ్యాఖ్యానించడానికి మాత్రం వైసీపీ శ్రేణులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.


