మరో 5 రోజుల్లో క్రికెట్ ఫ్యాన్స్కి పండుగే. ఐపీఎల్ సమరంతో రెండు నెలలపాటు సమ్మర్ను ఎంజాయ్ చేశారు క్రికెట్ అభిమానులు. ఇక ఇప్పుడు టి 20 వరల్డ్ కప్ ఫ్యాన్స్ను అలరించనుంది. దీంతో అందరి ఫోకస్ ఇప్పుడు పొట్టి ప్రపంచకప్పై పడింది. జూన్ 2 నుంచి ప్రారంభంకానున్న ఈ పోరులో తలబడేం దుకు ఇప్పటికే టీమిండియా అమెరికాలో అడుగుపెట్టింది.
ఐపీఎల్ సమరం ఇలా ముగిసిందో లేదో క్రికెట్ ఫ్యాన్స్కు వినోదాన్ని అందించేందుకు టీ20 వరల్డ్ కప్ సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో అంటే జూన్ 2వ తేదీ నుంచి ఆట ప్రారంభంకానుంది. ఇందుకోసం అమెరికాకు చేరుకుంది టీమిండియా. ఇందుకు సంబంధించిన వీడియోను ‘టచ్డౌన్ న్యూయార్క్’ అంటూ బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అమెరికా వెళ్లిన భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు ప్రధాన క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. విరాట్ కోహ్లీ మాత్రం కాస్త ఆలస్యంగా అంటే,.. మే 30వ తేదీ ఉదయం న్యూయార్క్కు వెళ్లనున్నాడు. కోహ్లీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కూడా ఆలస్యంగా వెళ్లనున్నారు.
విశ్వవేదికగా జరిగే టీ 20 సమరానికి అమెరికా, వెస్టిండీస్ దేశాలు వేదికకానున్నాయి. 20 జట్లు 55 మ్యాచ్ల్లో క్రికెట్ ప్రేమికులను అలరించనున్నాయి. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజిం చారు. గ్రూపులో ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అక్కడ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. సూపర్ 8లో ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. ఈ టోర్నీ జూన్ 2న ప్రారంభమై జూన్ 29న ముగియనుంది. ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు జూన్ 5న ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుండగా, జూన్ 9న దాయాది దేశం పాకిస్థాన్తో తలపడనుంది. జూన్ 12న అమెరికాతో తలపడుతుంది. భారత్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్ను జూన్ 15న కెనడాతో ఆడుతుంది. ఇక ప్రాక్టీస్లో భాగంగా మే 31న భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏకైక వార్మప్ మ్యాచ్ జరగనుంది.