తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసును సుప్రీంకోర్టు క్లోజ్ చేసింది. గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం.. వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన గవర్నర్ తరపు న్యాయవాది.. గవర్నర్ దగ్గర ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని తెలిపారు. రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం పంపారని వాదించారు. అనంతరం ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ.. గవర్నర్లు నిర్ణీత కాలవ్యవధి లోగా బిల్లులపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వారం రోజులు, గుజరాత్ రాష్ట్రంలో నెల రోజుల్లోనే గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీకుంటున్నారని న్యాయస్థానానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసును ముగిస్తూ పైవిధంగా తీర్పు ఇచ్చింది.