స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ దిగ్గజ కార్ మేకర్ మహీంద్ర ఇండియా సాయుధ దళాల కోసం పూర్తి దేశీయ టెక్నాలజీతో ‘ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్’ అనే ప్రత్యేకమైన వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనం డెలివరీని ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఈ వాహనం గురించి ఆనంద్ మహీంద్రా ట్వీటర్ వేదికగా.. ‘‘మహీంద్రా డిఫెన్స్, మేము ఇప్పుడే ఆర్మడో- భారతదేశపు మొదటి ఆర్మడర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికిల్ డెలివరీని ప్రారంభించాము. మన సాయుధ దళాల కోసం భారతదేశంలో గర్వంగా అభివృద్ధి చేసి రూపొందించబడింది. జైహింద్’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టులు పాలుపంచుకున్న వారికి ఆనంద్ మహీంద్రా ధన్యవాదాలు తెలిపారు. సహనం, పట్టుదల, అభిరుచితో ఈ ప్రాజెక్టును నిజం చేసిన సుఖ్విందర్ హేయర్ అతని టీంకి నా కృతజ్ఞతలు అంటూ మహీంద్రా మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఆర్మడో అనేది భారత రక్షణ దళాల ఉపయోగం కోసం నిర్మించిన తేలికపాటి సాయుధ వాహనం. ఇది అదనపు లోడ్ బేరింగ్ కెపాసిటీతో వస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు, ఉద్రిక్త ప్రాంతాలలో పెట్రోలింగ్ లలో ఉపయోగపడనుంది. ప్రత్యేకదళాలు, క్విక్ యాక్షన్ టీమ్స్ కి ఈ వాహనం చాలా అనుకూలంగా ఉండనుంది. దీన్ని సరిహద్దుల వెంబడి ఎడారి ప్రాంతాల్లో, సరిహద్దు భద్రత కోసం ఉపయోగించవచ్చు.