భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈమేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.
గత డిసెంబరు 30న తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఎ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం మూడుసార్లు ప్రయత్నించగా.. పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది.
చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈక్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్ట్లో వెల్లడించింది. దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈతరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది.