ఎండలు, ఉక్కపోతలతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాలను తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఏటా మే 22న దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తుంటాయి. కానీ ఈసారి మూడు రోజులు ముందుగానే వస్తున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


