భారత్ నుంచి యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి.. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలోకి దించుతోన్న ఓ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ గుట్టు రట్టయ్యింది. రష్యా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఇద్దరు ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. వారిని రాజస్థాన్కు చెందిన మొయినుద్దీన్ చిప్పా, క్రిస్టినాలుగా గుర్తించింది. 17 వీసా కన్సల్టెన్సీలు, వాటి యజమానులు, ఏజెంట్ల పేర్లనూ సీబీఐ తన ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సోదాలను ముమ్మరం చేసింది.
మెరుగైన జీవితం, విద్య, అధిక వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ నిందితులు తమ ఏజెంట్ల ద్వారా భారతీయులను రష్యాకు తరలించి వారి నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్ప డ్డట్లు గుర్తించింది. ఫీజుల్లో రాయితీ, వీసా పొడిగింపులు అందిస్తూ.. అనుమానాస్పద ప్రైవేటు విశ్వ విద్యాలయాల్లో ప్రవేశం కల్పించి విద్యార్థులను మోసగించారు. ఇటువంటి 35 కేసులను గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. రష్యాకు చేరుకున్న అనంతరం పాస్పోర్టులను స్వాధీనం చేసుకు న్నారని, యుద్ధంలో చేరేలా బలవంతం చేశారని పేర్కొంది. ఈ క్రమంలో యుద్ధక్షేత్రంలో కొంతమంది బాధితులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.ఈ వ్యవహారంలో దిల్లీ, తిరువనంతపురం, ముంబయి, చండీగఢ్, మదురై, చెన్నై తదితర 13 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఇప్పటివరకు రూ.50 లక్షలకుపైగా నగదు, ల్యాప్టాప్లు, ఫోన్లు, సీసీటీవీ ఫుటేజీ వంటి ఎలక్ట్రానిక్ రికార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, తనిఖీలు కొనసాగుతున్నాయని ఓ అధికారి చెప్పారు. విచారణ నిమిత్తం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉందని, వారంతా వ్యవస్థీకృత పద్ధతిలో పని చేస్తున్నారని పేర్కొన్నారు.