హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభయ్యే ఈ యాత్ర సికింద్రాబాద్ లోని తాడిబండ్ ఆలయం వరకూ సాగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందో హైదరాబాద్ సీపీ రూట్ మ్యాప్ విడుదల చేశారు. శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమై కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసి క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, బన్సీలాల్ పేట్ మీదగా సికింద్రాబాద్ తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరుగుతుంది.
దాదాపు 13 కిలోమీటర్ల మేర హనుమాన్ శోభా యాత్ర జరుగుతుండడంతో 12వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలు రేపు ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఈ శోభయాత్ర సాగే రూట్లలో 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి శోభాయాత్ర పర్యవేక్షణ చేస్తున్నారు. వెహికిల్ మౌంటెడ్ జూమ్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు.