విశాఖ విజన్ పేరుతో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైఎస్ షర్మిల స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా? అని మండిపడ్డారు.. పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం తమ చేతకాని కమిట్మెంట్ అని విమర్శించారు. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం తమ విజన్ అని తెలిపారు.. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం ప్రాక్టికల్ అని చెప్పు కొచ్చారు.. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


