స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ముంబయిలో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. కొందరు కార్యకర్తలు అయితే రాజీనామా వద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు పార్టీ తదుపరి అధ్యక్ష బాధ్యతలను ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తన సమీప బంధువైన మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ NCPని వీడి బీజేపీలో చేరే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భిన్న సిద్దాంతాలు కలిగిన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీగా అధికారం చేపట్టడంలో శరద్ పవార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.