స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సీపీ సీవీ ఆనంద్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలను నివారించడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పనికి రావడం లేదన్నారు. ప్రజలు రోడ్డు దాటడానికి వాటిని వాడడం లేదన్నారు. ప్రతి ఏడాది రోడ్ ప్రమాదాల్లో 50 శాతానికి పైగా పాదచారులే చనిపోతున్నారని వ్యాఖ్యానించారు. రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ ఉపయోగపడతాయని అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో 30 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రయాణికుల్ని రోడ్డు దాటించేందుకు పెలికాన్ సిగ్నల్ వద్ద వాలెంటీర్స్ ఉంటారని అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది పాదచారులు చనిపోయారని తెలిపారు. రోడ్డు దాటేటప్పుడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అందుకే పెలికాన్ సిగ్నల్ ద్వారా రోడ్ ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.